మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2020-02-20T02:56:48+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తగ్గుతుండటంపై మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం అసలైన సమస్యలను గుర్తించడం లేదన్నారు.

మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తగ్గుతుండటంపై మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం అసలైన సమస్యలను గుర్తించడం లేదన్నారు. సమస్యలను గుర్తించకపోతే, వాటికి విశ్వసనీయమైన పరిష్కారాలను కనుగొనడం కష్టమవుతుందని హెచ్చరించారు. ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా రాసిన పుస్తకం ‘బ్యాక్‌స్టేజ్’ ఆవిష్కరణ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడారు. 



ప్రస్తుత ప్రభుత్వం ‘మందగమనం’ అనే పదాన్ని అంగీకరించడం లేదని మన్మోహన్ సింగ్ అన్నారు. సమస్యలను గుర్తించకపోతే, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం కోసం విశ్వసనీయమైన సమాధానాలను కనుగొనడం సాధ్యం కాదని, ఇది నిజంగా ప్రమాదకరమని హెచ్చరించారు. 


‘బ్యాక్‌స్టేజ్’ గురించి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఈ పుస్తకంలో యూపీయే ప్రభుత్వం గురించి మంచిగా రాయడంతోపాటు, దాని బలహీనతలను కూడా ప్రస్తావించారని చెప్పారు. 


‘‘ఈ సమస్యలపై చర్చ జరుగుతుందని అనుకుంటున్నాను, చర్చ జరగాలి కూడా, ఎందుకంటే, ‘మందగమనం’ అనే పదం అనేది ఒకటి ఉందని అంగీకరించని ఓ ప్రభుత్వం నేడు మనకు ఉంది. ఇది మన దేశానికి మంచిది కాదని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పారు. 


‘‘మీరు ఎదుర్కొనే సమస్యలను మీరు గుర్తించనట్లయితే, దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి విశ్వసనీయ సమాధానాలను కనుగొనలేకపోవచ్చు. ఇది నిజమైన అపాయం’’ అని చెప్పారు. 


ఈ పుస్తకం భవిష్యత్తులో దేశాభివృద్ధికి దోహదపడుతుందని మాజీ ప్రధాని చెప్పారు.

 


Updated Date - 2020-02-20T02:56:48+05:30 IST