పని భారంతో పీయూష్ గోయల్ సతమతం... G20 Sherpa job అమితాబ్ కాంత్‌కు అప్పగింత...

ABN , First Publish Date - 2022-07-07T20:32:12+05:30 IST

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పని భారంతో సతమతమవుతున్నారు

పని భారంతో పీయూష్ గోయల్ సతమతం... G20 Sherpa job అమితాబ్ కాంత్‌కు అప్పగింత...

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పని భారంతో సతమతమవుతున్నారు. దీంతో అత్యంత కీలకమైన జీ-20 సదస్సు షెర్పా బాధ్యతలను నీతీ ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్‌కు అప్పగించారు. రాజ్యసభ నేతగా, యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చోపచర్చలు జరపవలసి ఉన్నందున గోయల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 


జీ-20 సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత దేశం 2022 డిసెంబరు 1న చేపడుతుంది. 2023లో ఈ సదస్సు మన దేశంలోనే, మరీ ముఖ్యంగా జమ్మూ-కశ్మీరులో  జరుగుతుంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి. 


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో జరుగుతాయి. పీయూష్ గోయల్ రాజ్యసభ నేతగా బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. అదే సమయంలో ఆయన యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరపవలసి ఉంటుంది. సమయాభావం వల్ల జీ-20 షెర్పా బాధ్యతలను నిర్వహించడం సాధ్యం కాదు. జీ-20 సదస్సు అధ్యక్ష బాధ్యతలు భారత దేశానికి రానున్నందువల్ల పూర్తి సమయాన్ని షెర్పా బాధ్యతల నిర్వహణకు వెచ్చించవలసి ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే సమావేశాలకు హాజరుకావలసి ఉంటుంది. అందువల్ల జీ-20 షెర్పా బాధ్యతలను చేపట్టాలని ఆయన నీతీ ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్‌ను కోరారు. 


పీయూష్ గోయల్ గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఆస్ట్రేలియాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరిపారు. బ్రిటన్, యూరోపియన్ యూనియన్లతో కూడా ఈ ఒప్పందం కోసం సంపూర్ణ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఇవన్నీ భారీ మార్కెట్లు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే సామర్థ్యంగల పరిశ్రమలకు సంబంధించిన అంశాలు కావడంతో మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ ఒప్పందాలు భారత దేశ కార్మిక రంగంలో పెను మార్పులను తీసుకురాగలవు కాబట్టి గోయల్ తన మంత్రిత్వ శాఖల నుంచి దృష్టిని మళ్ళించకూడదని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో అమితాబ్ కాంత్‌ను జీ-20 షెర్పాగా ప్రభుత్వం నియమించింది. 


Updated Date - 2022-07-07T20:32:12+05:30 IST