మోదీ మెప్పు కోసం సీఎం జగన్ తాపత్రయం: Chinta mohan
ABN , First Publish Date - 2021-10-12T17:24:39+05:30 IST
దేశంలో, రాష్ట్రంలో నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.
ఒంగోలు: దేశంలో, రాష్ట్రంలో నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. దేశంలో ప్రజలను బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారన్నారు. దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ తీసుకువచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని తెలిపారు. మోదీ సోషలిస్ట్ విధానాలను పక్కనపెట్టి కాపిటలిస్ట్ విధానాలు తీసుకువచ్చి దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఇతర సదుపాయాలు ఇవ్వటం లేదన్నారు. విద్యార్థులకు వాతలు పెట్టి ముఖ్యమంత్రి తిరుపతి వెళ్లి అవులకు మేతలు వేస్తున్నారని ఆయన యెద్దేవా చేశారు. మోదీ మెప్పు కోసం సీఎం తాపత్రయపడుతున్నారన్నారు. ఆయన అమలు చేస్తున్నవి నవరత్నాలు కాదు.. నవరంధ్రాలని వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని, చీఫ్ జస్టిస్ సమావేశంలోకి ఓ పారిశ్రామికవేత్త కూడా వెళ్లి కూర్చునే విధంగా పరిస్థితులు మారిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఎటు బదిలీ చేసిందో తెలియదని చెప్పారు. ఏపీలో బొగ్గు కొరతతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లబోతుందన్నారు. రాష్ట్రంలో మంత్రుల వ్యవహారం చిన్నపిల్లల ఆటలా ఉందని చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.