మాజీ ఎమ్మెల్యే బీసీకి బెయిల్‌ మంజూరు

ABN , First Publish Date - 2021-06-22T05:41:30+05:30 IST

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డికి కర్నూలు ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది.

మాజీ ఎమ్మెల్యే బీసీకి బెయిల్‌ మంజూరు
ఆదోని జైలు వద్ద ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తిక్కారెడ్డి

బనగానపల్లె/ఆదోని, జూన్‌ 21, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డికి కర్నూలు ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. మే నెలలో జరిగిన ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే బీసీతో పాటు వ్యక్తిగత పీఏ మురళీమోహన్‌రెడ్డి, రమణ, శీను, దివాకర్‌, విజయ్‌రెడ్డి, నరసింహ, పెద్దహుస్సేని, అత్తార్‌సాహెబ్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. గత నెల 23వ తేదీన ఆదివారం అర్ధరాత్రి పోలీసులు బీసీ జనార్దన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో డోన్‌ కోర్డు బీసీకి 14 రోజుల రిమాండ్‌కు విధించింది. దీంతో పోలీసులు బీసీని ఆదోని సబ్‌జైలుకు తరలించారు. 28 రోజుల పాటు ఆదోని సబ్‌జైలులో బీసీ ఉన్నారు. బీసీతో పాటు మిగిలిన వారికి సోమవారం బెయిల్‌ మంజూరు చేయగా.. ఇందుకు సంబంధించి రికార్డులు ఆదోని సబ్‌జైలుకు తీసుకుని వచ్చి రికార్డులు తనిఖీ చేసేలోగా రాత్రి 7 గంటలు కావడంతో రిలీజ్‌ చేయలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం విడుదల చేస్తామన్నారు. అప్పటి వరకు వేచిచూసిన టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయకుడు, కార్యకర్తలు వెనుదిరిగారు. కాగా బీసీకి బెయిల్‌ రావడంతో బనగానపల్లెలోని పలు కూడళ్లలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ కృష్ణమూర్తి, శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-06-22T05:41:30+05:30 IST