Modi వల్లే మణిపూర్ ప్రశాంతంగా ఉంది : సీఎం బిరేన్ సింగ్

ABN , First Publish Date - 2021-08-01T18:29:32+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ అన్నారు. ఈశాన్య ప్రాంతానికి

Modi వల్లే మణిపూర్ ప్రశాంతంగా ఉంది : సీఎం బిరేన్ సింగ్

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ అన్నారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన ఐదుగురిని తాజాగా కేబినెట్‌లోకి తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, ఈ విషయంపై తాము కొన్ని రోజుల క్రిందటే ప్రకటన చేశామని గుర్తు చేశారు. మణిపూర్ పీసీసీ మాజీ అధ్యక్షుడు గోవిందదాస్ ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం పై వ్యాఖ్యలు చేశారు. గతంలో మణిపూర్‌లో నిత్యం ఉద్యమాలు జరుగుతూ ఉండేవని, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే మణిపూర్ శాంతియుతంగా మారిందని అన్నారు. ‘‘నేను కూడా కాంగ్రెస్‌లో పనిచేశా. కానీ... డ్రైవర్ నిద్రపోతే... బండిని ఎవరు నడుపుతారు... బండి ఎలా ముందుకు కదులుతుంది?’’ అంటూ సీఎం బిరేన్ సింగ్ పరోక్షంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.  

బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్

మణిపూర్ మాజీ పీసీసీ చీఫ్ గోవింద్ దాస్ ఆదివారం బీజేపీలో చేరారు. సీఎం బిరేన్ సింగ్‌తో పాటు జాతీయ నేతల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో చీఫ్ విప్‌గా కూడా కొనసాగారు. 

Updated Date - 2021-08-01T18:29:32+05:30 IST