మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-10-25T01:40:49+05:30 IST

మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్‌కు కరోనా పాజిటివ్

మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్‌కు కరోనా పాజిటివ్

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇవాళ ట్విటర్ వేదికగా ఆయన ఈ విషయం వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు తాను ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు ఫడ్నవిస్ తెలిపారు. ఈ నెల 28 నుంచి నవంబర్ 7 వరకు బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రచార బాధ్యతలను ఫడ్నవిస్ పర్యవేక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఇన్నాళ్లూ తాను పనిచేస్తూనే వచ్చాననీ.. అయితే భగవంతుడు తనకు తాత్కాలికంగా విశ్రాంతి ఇచ్చేందుకే ఇలా చేశాడేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు.


‘‘లాక్‌డౌన్ మొదలు ఇప్పటి వరకు నేను ప్రతిరోజూ పనిచేస్తూనే ఉన్నాను. అయితే భగవంతుడు నన్ను విశ్రాంతి తీసుకోమని కొంత బ్రేక్ ఇచ్చినట్టు ఉన్నాడు! నాకు కొవిడ్-19 పాజిటివ్ నిర్థారణ కావడంతో ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ చికిత్స తీసుకుంటున్నాను...’’ అని ఫడ్నవిస్ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా కొద్ది రోజుల క్రితం బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాను పాట్నా ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాననీ.. త్వరలోనే మళ్లీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన ట్విటర్లో తెలిపారు. 



Updated Date - 2020-10-25T01:40:49+05:30 IST