Former Chief Minister Statement: ‘డబుల్ ఇంజన్’ పేరుతో డబుల్ గేమ్
ABN , First Publish Date - 2022-07-31T18:11:50+05:30 IST
డబుల్ ఇంజన్ ప్రభుత్వాలంటూ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని, ఇదే నిజమైతే గత మూడేళ్లుగా జలవనరుల శాఖకు సంబంధించి కనీసం ఒక్క
- బీజేపీ తీరుపై జేడీఎస్ ఆగ్రహం
బెంగళూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): డబుల్ ఇంజన్ ప్రభుత్వాలంటూ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని, ఇదే నిజమైతే గత మూడేళ్లుగా జలవనరుల శాఖకు సంబంధించి కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా ఎందుకు ఆమోదముద్ర వేయించుకోలేకపోయారని జేడీఎస్ ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. తన కార్యకర్తలనే రక్షించుకోలేని అసమర్థ బీజేపీ ప్రభుత్వం ఇక రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల పట్ల పక్షపాతం చూపనంటూ రాజ్యాంగం పేరిట ప్రమాణ స్వీకారం చేసిన సీఎం ప్రమాణ స్వీకారానికే కళంకం తెచ్చారని కుమార స్వామి విరుచుకుపడ్డారు. తమకు అన్ని వర్గాల ప్రజల ప్రాణాలు ముఖ్యమేనని డాంబికాలు పలుకుతున్న సీఎం, ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించినట్లే మసూద్, ఫాజిల్ కుటుంబాలను కూడా పరామర్శించి నష్టపరిహారం ప్రకటించి ఉంటే ఈ రోజు ప్రజల పాలిట హీరో అయ్యేవారన్నారు. సంఘ్ పరివార్(Sangh Parivar) కన్నుసన్నల్లో పనిచేస్తున్న బొమ్మై కేవలం ఒక వర్గానికి మాత్రమే సీఎం కాదన్న సంగతిని గుర్తెరగాలని ఆయన ట్వీట్ చేశారు. కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన మాజీ డీసీఎం ఈశ్వరప్ప(Former DCM Eshwarappa), బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య తీరు దారుణమన్నారు. ఓట్ల కోసమే బీజేపీకి కార్యకర్తల సేవలు అవసరమని ఆపై వారు ఏమైనా అనవసరమనే అభిప్రాయాలు ఈ నేతల వ్యాఖ్యలతో రుజువవుతున్నాయన్నారు. మొత్తమ్మీద మరోరోజూ ట్వీట్ పర్వం కొనసాగింది.