ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవం: JD laxmi narayana
ABN , First Publish Date - 2022-07-11T17:33:07+05:30 IST
దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.
ప్రకాశం: దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ(Lakshmi Narayana) స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్లీనరీ(YCP Plenary) తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ముమ్మరమైందన్నారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వెల్లడించారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసీపీకి ఇది సరైన సమయం....
రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీ(BJP)కి లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీకి వైసీపీ(YCP) మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా(Special status) డిమాండ్ను నెరవేర్చుకునేందుకు వైసీపీకి ఇది సరైన సమయమని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని జేడీ లక్ష్మీ నారాయణ చెప్పుకొచ్చారు.