అటవీ రక్షణ, పునరుద్దరణ ధ్యేయంగా పనిచేయండి
ABN , First Publish Date - 2020-12-05T23:29:01+05:30 IST
కరోనా వల్ల ఆలస్యం అయిన అటవీ సంరక్షణ, అటవీ పునరుద్దరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్ని అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ అధికారులను
హైదరాబాద్ : కరోనా వల్ల ఆలస్యం అయిన అటవీ సంరక్షణ, అటవీ పునరుద్దరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్ని అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆదేశించారు. వచ్చే సీజన్ కు సంబంధించిన తెలంగాణకు హరితహారం కోసం నర్సరీ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అటవీ పునరుద్దరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ (కంపా), అర్బన్ పార్కుల పనులను లక్ష్యం మేరకు త్వరగా పూర్తి చేయాలని, ప్రతీ అధికారి క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తూ పనులను పర్యవేక్షించాలని అదేశించారు.
శాఖా పరంగా జరిగే ఏ పనిలోనైనా నాణ్యత, కచ్చితత్వం ఉండాలని, అలా పనులు జరగని చోట్ల సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ అగ్ని ప్రమాదాలను కనీసం స్థాయికి తగ్గించేలా ముందస్తు కార్యాచరణ ఉండాలన్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ పార్కులను స్థానిక అటవీ అధికారులు సందర్శించి ఎప్పటికప్పుడు సాంకేతిక సహకారం అందిచాలని సూచించారు.
వన్యప్రాణుల సంచారం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని, జంతువులను రక్షించటంతో పాటు, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు తగిన సూచనలు ఇస్తూ మనుషులు, జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం నివారించేలా అటవీ అధికారులు, సిబ్బంది పనిచేయాలని తెలిపారు. కంపా నిధుల ఖర్చు, పనుల పురోగతిపై పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్ జిల్లాల వారీగా అధికారులతో సమీక్షించారు.
హరితహారం, అర్బన్ పార్కులు, రహదారి వనాల ఏర్పాటుపై పీసీసీఎఫ్ ఆర్.ఎం. దోబ్రియల్ పలు సూచనలు చేశారు. ఇంకా సమావేశంలో పీసీసీఎఫ్ (అటవీ రక్షణ) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు పర్గెయిన్, సిధ్దానంద్ కుక్రేటీ, అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.