Forests protection పునరుద్దరణ పై ఉన్నతాధికారుల పరిశీలన
ABN , First Publish Date - 2022-05-28T01:28:00+05:30 IST
క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్న అటవీకరణ, సంరక్షణ పనులను పర్యవేక్షించేందుకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ ఎం డోబ్రియాల్(Dobrial) వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్న అటవీకరణ, సంరక్షణ పనులను పర్యవేక్షించేందుకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ ఎం డోబ్రియాల్(Dobrial) వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన పీసీసీఎఫ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కొత్తగూడెం సర్కిల్ లో పర్యటించారు.అడవుల రక్షణ, పునరుద్దరణ, హరితహారం సన్నాహకాలు, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, గుత్తికోయల ఆవాసాలను డోబ్రియాల్ పరిశీలించారు.కొత్తగూడెం, రామవరం రేంజ్ పరిధిలో వేలాది హెక్టార్లలో అటవీ పునరుద్దరణలో పెంచిన చెట్లను పరిశీలించారు. చాతకొండ, రామవరం, పెనగడప రిజర్వు ఫారెస్ట్ లో చేపట్టిన పునరుజ్జీవన చర్యలు బాగున్నాయని, సిబ్బంది చక్కగా పనిచేస్తున్నారని పీసీసీఎఫ్ ప్రశంసించారు.
వేసవిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ లైన్స్ ఏర్పాటు, రాపిడ్ యాక్షన్ టీమ్ ల పనితీరుపై ఆరాతీశారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి వసతి కేంద్రాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. రామవరం రేంజ్ లోని జగ్గంపేట సమీపంలో గుత్తికోయల ఆవాసానికి వెళ్లిన పీసీసీఎఫ్ వారితో మాట్లాడి అడవుల రక్షణకు ప్రభుత్వంతో సహకరించాలని, అడవులను నరికివేత ఎట్టిపరిస్థితుల్లోనే చేయవద్దని తెలిపారు.మణుగూరు డివిజన్ సందిళ్లపాడు నర్సరీని పరిశీలించి, హరితహారం సందర్భంగా మున్సిపాలిటీలకు సరఫరా చేసేందుకు వీలైనంత పెద్ద మొక్కలను సిద్దం చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది నిబద్దతతో పనిచేయాలని, ఏవైనా సమస్యలు, సవాళ్లు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.