పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు
ABN , First Publish Date - 2022-05-24T09:31:39+05:30 IST
రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
- తండ్రి మరణ బాధను దిగమింగుకుని..
- పరీక్షలు రాసిన ఇద్దరు విద్యార్థినులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే, కొందరు విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసి, చదువుపై ఉన్న ఇష్టాన్ని చాటుకున్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన పుట్ట శ్రుతి తండ్రి పుట్ట సైదులు (40) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం పరీక్ష రాసిన శ్రుతి అనంతరం ఇంటికి వెళ్లి తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికింది. కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన ఇడికోజు లలిత అనే విద్యార్థిని తండ్రి పురుషోత్తమచారి(48) అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందాడు. పరీక్ష రాసిన లలిత అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్కు చెందిన రాంపల్లి అభినందనచారి తండ్రి రాజమౌళి ఆదివారం మరణించారు.
తండ్రి రాజమౌళి అంత్యక్రియలు నిర్వహించిన అభినందనచారి సోమవారం పట్టణంలోని మోడల్ స్కూల్ కేంద్రంలో పరీక్ష రాశాడు. కాగా, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన చెన్నెంశెట్టి నవీన్కృష్ణ కాలికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయంకాగా, వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా కోదాడలోని పరీక్షా కేంద్రానికి ఆటోలో వచ్చి అందరు విద్యార్థులతో కలిసి పరీక్ష రాశాడు. మరోవైపు, రాష్ట్రంలో మొదటి రోజు జరిగిన ఫస్ట్ లాంగ్వేజి పరీక్షకు 99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 5,08,143 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, అందులో 5,03,041 మంది హాజరయ్యారు. అలాగే.. ఫస్ట్ లాంగ్వేజి పరీక్ష 158 మంది ప్రైవేట్ విద్యార్థులు రాయాల్సి ఉండగా, 89 మంది రాశారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.
అంబులెన్స్లో పరీక్ష రాసిన విద్యార్థి
సూర్యాపేట జిల్లా సజ్జాపురంతండాకు చెందిన బాణావత్ గౌతమ్ మిర్యాలగూడలో పదో తరగతి చదువుతున్నాడు. వారం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమ్ కాలుకు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల అనుమతితో పరీక్షా కేంద్రానికి అంబులెన్స్లో వచ్చిన గౌతమ్.. ప్రత్యేక ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో పరీక్ష రాశాడు.