దసరా ఉత్సవాలకు..శివరామాలయం ముస్తాబు

ABN , First Publish Date - 2020-10-16T06:27:34+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోన్న మండలంలోని మైసిగండి శివరామాలయాల్లో

దసరా ఉత్సవాలకు..శివరామాలయం ముస్తాబు

రేపటి నుంచి 25వ తేదీ వరకు కొనసాగింపు

కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు

ఆలయ ఆవరణలో నిత్య చండీహోమం 


ఆమనగల్లు: ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోన్న మండలంలోని మైసిగండి శివరామాలయాల్లో అన్నపూర్ణేశ్వరీ, మహాలక్ష్మి, జ్ఞానసరస్వతీదేవి దసరా శరన్నవరాత్రోత్సవాలకు ముస్తాబయ్యాయి. ప్రతియేటా ఆశ్వయుజ శుక్లపాఢ్యమి మొదలు శుక్ల దశమి వరకు  వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు కనులపండువగా నిర్వహించే ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, యాదాద్రి, నల్లగొండ, మెదక్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, కరీంనగర్‌ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. 


భారీ ఏర్పాట్లు

మైసిగండి శివాలయం వద్ద 10 రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాల కోసం ఆలయ నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి ఆలయం వద్ద వసతి ఏర్పాటు చేస్తున్నారు. మండప దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.కల్వకుర్తి, ఆమనగల్లు, హైదరాబాద్‌ నుంచి మైసిగండికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


గంగ సమతుల్యతను సంతరించుకున్న కోనేరు

మైసిగండి శివాలయం ముందు భాగంలో గల కోనేరు గంగ సమతుల్యతను సంతరించుకుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరుకోగా దశాబ్దం క్రితం సుమారు రూ.కోటి వెచ్చించి ఆధునికీకరించారు.

Updated Date - 2020-10-16T06:27:34+05:30 IST