ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట.. కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నించాయా?
ABN , First Publish Date - 2022-08-19T08:06:01+05:30 IST
కేసీఆర్ పాలనలో ప్రజలు ఆగమవుతుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడైనా కేసీఆర్ను ప్రశ్నించాయా అని వైఎ్సఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
తెలంగాణను మోసం చేసిన బీజేపీని ఎందుకు నమ్మాలి
4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదు: షర్మిల
ఊట్కూర్, ఆగస్టు 18: కేసీఆర్ పాలనలో ప్రజలు ఆగమవుతుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడైనా కేసీఆర్ను ప్రశ్నించాయా అని వైఎ్సఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థాన పాదయాత్ర 125వ రోజు అయిన గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి, ఊట్కూర్ పెద్దపొర్ల, చిన్నపొర్ల గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆమె మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా తెలంగాణ లో కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంటే.. ఎప్పుడైనా ప్రజల పక్షాన మాట్లాడారా అని కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రజల తరఫున మాట్లాడాల్సిన వారందరూ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నారా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశారు కానీ ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా అధోగతి పాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణను మోసం చేసిన బీజేపీని ఎందుకు నమ్మాలన్నారు. మత రాజకీయాలు చేయడం తప్ప ఒక్క విభజన హామీనైనా నిలబెట్టుకుందా అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో దేశమంతా 46 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తే.. ఏపీలో రాజశేఖర్రెడ్డి ఒక్కరే 46 లక్షల ఇళ్లు నిర్మించారని తెలిపారు.