అన్నంలో బొద్దింకలు, పురుగులున్నాయ్..: క్వారంటైన్లో ఉన్న ఎన్నారైల ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-05-22T16:01:30+05:30 IST
వివిధ దేశాల నుంచి మాతృదేశానికి తిరిగివచ్చి 14 రోజుల క్వారంటైన్లో ఉన్న తమకు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఎన్నారైలు వాపోతున్నారు.
సెంట్రల్కోర్టు హోటల్లో భోజనంపై ఎన్నారైల ఫిర్యాదు
ఖైరతాబాద్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): వివిధ దేశాల నుంచి మాతృదేశానికి తిరిగివచ్చి 14 రోజుల క్వారంటైన్లో ఉన్న తమకు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఎన్నారైలు వాపోతున్నారు. లక్డీకాపూల్లోని సెంట్రల్ కోర్టు హోటల్లో దాదాపు 100 మంది వందే భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి విమానాల్లో నగరానికి వచ్చి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం క్వారంటైన్లో ఉన్నారు. తమకు టూరిజం శాఖ ద్వారా అందిస్తున్న భోజనం సరిగా లేదని, ఆహారంలో బొద్దింకలు, పురుగులు వస్తున్నాయని కొందరు ఎన్నారైలు, టూరిజం విభాగం కో-ఆర్డినేటర్, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
కట్టడి ప్రాంతంగా అల్జాపూర్?
అల్జాపూర్ను కట్టడి ప్రాంతంగా అధికారులు ప్రకటించారు. ఇటీవల ధూల్పేట్లో జరిగిన ఓ ఫంక్షన్లో పాల్గొని వచ్చిన లోథాబస్తీకి చెందిన కుటుంబ సభ్యులు కరోనాను మోసుకొచ్చారు. మొదట ఒక మహిళ, ఆ తర్వాత నలుగురు, ఆ తర్వాత ఒకరు ఇలా మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, మరో 35 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని మణికొండ మునిసిపల్ మేనేజర్ పవన్కుమార్ తెలిపారు. నార్సింగ్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఇప్పటికే రెండు దఫాలుగా వైద్య శిబిరం నిర్వహించారు. బస్తీలోకి రాకపోకలు సాగించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.