నిబంధనలు పాటించండి... ప్రమాదాలు తగ్గించండి
ABN , First Publish Date - 2020-06-07T10:50:00+05:30 IST
ఈ ఏడాది రహదారి భద్రతకు పెద్దపీట వేస్తామని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని
హైదరాబాద్ సిటీ, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది రహదారి భద్రతకు పెద్దపీట వేస్తామని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ ఆ దిశగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పిలియన్ రైడర్స్ (వెనుకాల కూర్చున్న వ్యక్తి) ఎక్కువగా మృతి చెందుతున్న విషయాన్ని వాహనదారులకు అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. ప్రసార మాధ్యమాలతో పాటు.. ట్విటర్, ఫేస్బుక్ సహా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అద్దం లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శివారు ప్రాంతాల్లోని గ్రామాల్లో కరపత్రాలు, ట్రాఫిక్ నిబంధనలతో కూడిన బొమ్మలు, సైన్బోర్డులతో పాంప్లేంట్స్ తయారు చేయించి, గ్రామాల్లోని కూడళ్లు, ఆటోడ్రైవర్లతో మాట్లాడుతూ పాంప్లేంట్లను అందజేస్తున్నారు.