ఒంట్లో బాగాలేదంటూ ఆస్పత్రికి వెళ్లిన మహిళ... స్కానింగ్ చేస్తే కాలేయంలో కనిపించిన దాన్ని చూసి నివ్వెరపోయిన డాక్టర్.. ఇదో వింత..!
ABN , First Publish Date - 2021-12-18T20:46:51+05:30 IST
ఆ మహిళ వయసు 33 ఏళ్లు.. కొన్ని నెలల కిందట ఆమె గర్భం దాల్చింది.. అయితే ప్రెగ్నెన్సీ ఖరారైన 49 రోజుల తర్వాత ఆమెకు రుతుస్త్రావం ప్రారంభమైంది..
ఆ మహిళ వయసు 33 ఏళ్లు.. కొన్ని నెలల కిందట ఆమె గర్భం దాల్చింది.. అయితే ప్రెగ్నెన్సీ ఖరారైన 49 రోజుల తర్వాత ఆమెకు రుతుస్త్రావం ప్రారంభమైంది.. 14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో ఆమె వైద్యుడిని ఆశ్రయించంది.. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా షాకింగ్ విషయం బయటపడింది.. పిండం గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్నట్టు గుర్తించి వైద్యులు షాకయ్యారు.. ఎందుకంటే కాలేయంలో పిండం పెరగడం అనేది చాలా చాలా అరుదు.. కెనడాలో ఈ ఘటన జరిగింది.
కెనడాలోని మానిటోబాలో ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ మైఖేల్ నార్వే ఈ అరుదైన ప్రెగ్నెన్సీని గుర్తించారు. 14 రోజుల పాటు రుతుస్రావం జరగడంతో భయపడిన మహిళ మైఖేల్ను కలిసింది. స్కానింగ్ తీయించిన డాక్టర్ షాకయ్యారు. పిండం కాలేయంలో పెరుగుతున్నట్టు గుర్తించారు. సాధారణంగా అండం శుక్రకణంతో కలిసి పిండంగా మారిన తర్వాత గర్భాశయంలోకి ఓ నాళం ద్వారా ప్రవేశిస్తుంది. చాలా అరుదైన సందర్భాల్లో గర్భాశయంలోకి వెళ్లకుండా వెలుపలే ఉండిపోతుంటుంది. అలాంటి కేసులను `ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ` గా పిలుస్తారు.
ఇలాంటి కేసులు ప్రపంచం మొత్తం మీద ఇప్పటివరకు 14 మాత్రమే వచ్చినట్టు వైద్యుడు మైఖేల్ చెప్పారు. కాగా, కాలేయంలో పిండం పెరగడాన్ని తను మొదటిసారి చూస్తున్నానని తెలిపారు. తాము చూసేటప్పటికే కాలేయంలో ఉన్న ఆ పిండంలో జీవం లేదని చెప్పారు. ఆ మహిళ కాలేయంలో ఉన్న పిండాన్ని శస్త్రచికిత్సతో తొలగించి ఆమెను కాపాడమని, ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.