టెలికాం రంగ స్థిరత్వంపై దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2020-02-20T06:27:04+05:30 IST

సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపులు జరపలేక నానా తంటాలుపడుతున్న టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ప్రభుత్వ ఊరట కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో

టెలికాం రంగ  స్థిరత్వంపై దృష్టి పెట్టండి

ఆర్థిక మంత్రితో ఎయిర్‌టెల్‌, వొడా ఐడియా చీఫ్‌ భేటీ 

న్యూఢిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపులు జరపలేక నానా తంటాలుపడుతున్న టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ప్రభుత్వ ఊరట కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌, వొడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ కుమార మంగ ళం బిర్లా బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అయుతే, మంత్రితో ఏం చర్చించారనే విషయాన్ని వెల్లడించేందుకు ఇరువురూ నిరాకరించారు. గడిచిన మూడున్నరేళ్ల నుంచి టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని సునీ ల్‌ మిట్టల్‌ అన్నారు. టెలికాం రంగ స్థిరత్వంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి కంటే ముందు టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తో మిట్టల్‌ సమావేశమయ్యారు.


నిర్మలతో భేటీ అనంతరం మిట్టల్‌ మాట్లాడుతూ.. ఏజీఆర్‌ బకాయిల గురించి చర్చించలేదన్నారు. ‘‘దేశానికి, ప్రభుత్వ డిజిటల్‌ ఎజెండాకు టెలికాం పరిశ్రమ కీలకం. ఇతర రంగాలకు చెందిన చాలా పరిశ్రమలూ టెలికాంపై ఆధారపడి ఉన్నాయి. ఉద్యోగాల కల్పన, టెలికాం సేవల ద్వారా సమకూరే పన్ను ఆదాయం వంటి ఆంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి టెలికాం రంగం స్థిరంగా ఉంచడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాలి’’ అని మిట్టల్‌ పేర్కొన్నారు. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ ఊరట కోరారా..? ఏమైనా హామీ లభించిందా అన్న ప్రశ్నలపై వ్యాఖ్యానించేందుకు కుమార మంగళం బిర్లా నిరాకరించారు. 

Updated Date - 2020-02-20T06:27:04+05:30 IST