సమస్యలపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

మండలంలోని పెదబిడ్డ పంచాయతీలో గురువారం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమాన్ని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నిర్వహించారు.

సమస్యలపై దృష్టి సారించండి
చెరుకుమడతలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ, తదితరులు


గడప గడపకు మనప్రభుత్వంలో ఎమ్మెల్యేను కోరిన స్థానికులు

అనంతగిరి, మే 19: మండలంలోని పెదబిడ్డ పంచాయతీలో గురువారం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమాన్ని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నిర్వహించారు. తొలుత మేడపర్తి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. మేడపర్తి జంక్షన్‌ నుంచి పెదబిడ్డ వరకు  తారురోడ్డు మరమ్మతులు చేపట్టాలని చెరుకుమడత గ్రామస్థులు కోరగా .. నిధులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే అన్నారు. చెరుకుమడతలో బోరు ఏర్పాటు చేసి నీటి పథకానికి అనుసంధానం చేయాలని గ్రామస్థులు కోరారు. మేడపర్తి -కొత్తవలస రహదారి పనులు వేగవంతం చేయాలని, పాతమేడపర్తి రహదారిలో కల్వర్టు నిర్మించాలని కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులను పిలిచి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, వైసీపీ మండల అధ్యక్షుడు ఆనంద్‌, ఎంపీటీసీ సభ్యురాలు జయశ్రీ, సర్పంచ్‌ పెంటమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణమూర్తి, ఎంపీడీఓ నగేష్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎంఈఓ వెంకటరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST