‘తుమ్మపాల’ను కాజేసే యత్నం

ABN , First Publish Date - 2022-07-01T06:41:32+05:30 IST

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని వైసీపీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తోందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరో పించారు. గురువారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే జిల్లాలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన నాటి నాయకులు, నేడు ఏమయ్యారని ప్రశ్నించారు.

‘తుమ్మపాల’ను కాజేసే యత్నం
సమావేశంలో మాట్లాడుతున్న బుద్ద

 ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నేతలు నేడు ఏమయ్యారు?

  నియోజకవర్గంలో ఫ్యాక్టరీని కాపాడలేని అసమర్థత మంత్రిది 

  టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు

అనకాపల్లి అర్బన్‌, జూన్‌ 30 : తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని వైసీపీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తోందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరో పించారు. గురువారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే జిల్లాలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన నాటి నాయకులు, నేడు ఏమయ్యారని ప్రశ్నించారు. సహకార చట్టాలకు విరుద్ధంగా రైతులతో బహిరంగ సభ నిర్వహించకుండా ఫ్యాక్టరీని పరిసమాప్తి చేసే ప్రయత్నాలకు తెరలేపడం దురదృష్టకరమన్నారు. చట్టప్రకారం ప్రభుత్వానికి 94శాతం వాటా ఉందని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు.  సహకార చట్టాలకు లోబడి రైతులు పొందే భాగస్వామ్యాన్ని కాజేసే భారీ కుట్రగా మిగులుతోందన్నారు.  రైతులను సంప్రదించకుండా అధికారులు గోప్యంగా ఫ్యాక్టరీకి వెళ్లి నివేదిక తయారు చేయడం కుట్ర రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ వైఖరి తెలుగుదేశం పార్టీ గమనిస్తుందని రైతులకు, కార్మికులకు అండగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా, తన నియోజకవర్గంలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీని కాపాడలేని అసమర్థ మంత్రిగా  అమర్‌నాథ్‌ నిలిచిపోతారని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగురైతు ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అక్కిరెడ్డి రమణబాబు, ఉగ్గిన రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:41:32+05:30 IST