'Flu' fevers: రాష్ట్రంలో 282 మంది చిన్నారులకు ‘ఫ్లూ’ జ్వరం

ABN , First Publish Date - 2022-09-16T15:29:22+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడిలోకి వస్తున్న తరుణంలో హఠాత్తుగా ‘ఫ్లూ’ జ్వరాలు('Flu' fevers) విజృంభిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2

'Flu' fevers: రాష్ట్రంలో 282 మంది చిన్నారులకు ‘ఫ్లూ’ జ్వరం

- ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఆరోగ్యమంత్రి 

- మాస్కులు ధరించాలని వినతి


చెన్నై, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడిలోకి వస్తున్న తరుణంలో హఠాత్తుగా ‘ఫ్లూ’ జ్వరాలు('Flu' fevers) విజృంభిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 282 మంది చిన్నారుల ఈ జ్వరంతో బాధపడుతున్నారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు తదితర జిల్లాల్లో ఈ జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎగ్మూరు చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో వందమందికి పైగా చిన్నారులు ఈ జ్వరానికి చికిత్స పొందుతున్నారు. ఇదే విధంగా రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) స్మారక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి, కీల్పాక్‌ వైద్యకళాశాల ఆసుపత్రి, స్టాన్లీ, రాయపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చిన్నారులు జ్వరంతో చికిత్సకోసం చేరుతున్నారు. ఈ నేపథ్యం లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ఎగ్మూరు ఆస్పత్రిలో ‘ఫ్లూ’ జ్వరాలతో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇన్‌ఫ్లూయంజా అనే ఈ ‘ఫ్లూ’ జ్వరాలు వ్యాప్తి చెందుతుండటంపై ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 282 మంది ఈ జ్వరంతో బాధపడుతున్నారని, వీరిలో 13 మంది చిన్నారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 215 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో, 54 మంది బాలబాలికలు ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారని వివరించారు. ఈ జ్వరాలను నిరోధించడానికి ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటివద్దే ఈ జ్వరపీడితులకు చికిత్స అందించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని, సుమారు రెండు మీటర్ల దూరం తప్పకుండా పాటించాలని మంత్రి సూచించారు.

Updated Date - 2022-09-16T15:29:22+05:30 IST