floods: తగ్గని కృష్ణమ్మ పరవళ్లు
ABN , First Publish Date - 2022-08-14T02:21:27+05:30 IST
కృష్ణమ్మ జోరు తగ్గడం లేదు. మూడు రోజులుగా శ్రీశైలం నుంచి వరద వస్తుండటంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులీడుతూ సాగర్ వైపునకు వస్తోంది.
నాగార్జునసాగర్: కృష్ణమ్మ జోరు తగ్గడం లేదు. మూడు రోజులుగా శ్రీశైలం నుంచి వరద వస్తుండటంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులీడుతూ సాగర్ వైపునకు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 2,70,061 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 9,306 క్యూసెక్కుల నీరు, మొత్తంగా 3,63,157 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు(215.8070టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 84.40అడుగులు (212.4385 టీఎంసీలు)గా ఉంది. దీంతో నాలుగు రోజులుగా శ్రీశైలం 10క్రస్ట్ గేట్లను 15అడుగులు మేరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని, కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 62,277 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 586.40 అడుగులకు (302.3940టీఎంసీలకు) చేరుకుంది. దీంతో సాగర్ 26క్రస్ట్ గేట్లల్లో 24క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర, 2 క్రస్ట్ గేట్లను 5అడుగుల మేర ఎత్తి 3,58,625 క్యూసెక్కుల నీటిని, కుడి కాల్వ ద్వారా 8,105 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 7,937 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,089 క్యూసెక్కుల నీటిని, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని, వరద కాల్వ ద్వారా 300క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 4,10,456 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి 4,38,947 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతోంది