floods: వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2022-07-21T21:48:15+05:30 IST
వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. కోడేరులో వశిష్ట గోదావరి నదిపై బోట్లో ఆయన ప్రయాణించారు.
ఏలూరు: వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. కోడేరులో వశిష్ట గోదావరి నదిపై బోట్లో ఆయన ప్రయాణించారు. అయోధ్యలంక, మర్రిమూల, పుచ్చలలంక, నక్కిలంక, రాయలంకల్లో బోటులోనే పర్యటిస్తారు. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. సాయంత్రం రాజోలు, పాలకొల్లులో పర్యటించి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురం, పొన్నపల్లి గోదావరి గట్టు, నర్సాపురం ప్రాంతాల్లో పర్యటిస్తారు. కోనసీమ (Konaseema) జిల్లా, పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు.
గోదావరి వరద (Godavari flood) నిలకడగా కొనసాగుతోంది. సముద్రంలోకి ప్రవాహం నెమ్మదిగా వెళ్తుండటంతో కోనసీమ జిల్లా (Konaseema District) లోని నదీ పరీవాహక లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతుండటం ప్రజల్లో గుబులు రేపుతోంది. ఇప్పటివరకు సుమారు 25కు పైగా గ్రామాలు ముంపులోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేకమంది జ్వరాలు, జలుబుతో బాధపడుతున్నారు. వరద ముప్పు నుంచి తేరుకుంటున్న గ్రామాల్లో బురద కష్టాలు ఎదుర్కొంటున్నారు. గోదావరి పక్కనే ఉన్నా గుక్కెడు మంచినీళ్ల కోసం పోలవరం ప్రజలు తిప్పలు పడుతున్నారు.