త్రివర్ణంతో నీలిరంగు!

ABN , First Publish Date - 2022-08-14T05:25:30+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో జాతీయ పతాకాన్ని అపవిత్రం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా నరసరావుపేటలో జాతీయ జెండా ప్రదర్శనలు జరిగాయి.

త్రివర్ణంతో నీలిరంగు!
త్రివర్ణంతో పాటు నీలి రంగు జెండా (పాతచిత్రం)

నరసరావుపేటలో జాతీయ పతాకానికి అవమానం

నరసరావుపేట, ఆగస్టు 13 : ఆజాదికా అమృత్‌  మహోత్సవాల్లో జాతీయ పతాకాన్ని అపవిత్రం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా నరసరావుపేటలో జాతీయ జెండా ప్రదర్శనలు జరిగాయి. త్రివర్ణంకు నీలిరంగు కలిపి ప్రదర్శించారు. ఉన్నతాధికారుల సాక్షిగా ఈ ఘటన ఆగస్టు 10వ తేదీన చోటు చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. సోషల్‌ మీడియాలో ఈ చిత్రాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒక ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థినులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. వీరు త్రివర్ణ రంగులతో కలిపి నీలి రంగును ప్రదర్శించారు. ఈ చిత్రం చూసిన వారు అవాక్కు అవుతున్నారు. అధికార పార్టీ రంగును చేర్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా నాలుగు రంగులు కలిపి ప్రదర్శించడాన్ని కూడా వారు నిలుపుదల చేసే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. అధికార పార్టీ రంగు త్రివర్ణకు కలిపి ప్రదర్శించడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. 


జెండాకు అగౌరవం

ఆజాది అమృత వహోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. నరసరావుపేట స్టేడియంలో స్వాతంత్య్ర  వేడుకలు జరగనున్నాయి. దీనిలో ప్రదర్శించేందుకు కలెక్టరేట్‌ నుంచి భారీ జాతీయ జెండాను ద్విచక్ర వాహనంపై తరలించారు. జాతీయ జెండా నేలకు రాసుకుంటూ, దీనిపై కాలు పెట్టి మరీ తీసుకెళ్లడం విమర్శలకు దారితీసింది. 


Updated Date - 2022-08-14T05:25:30+05:30 IST