బీచ్ రోడ్డులో ‘జెండా పండుగ’
ABN , First Publish Date - 2022-08-08T06:05:31+05:30 IST
అజాదీకా అమృత్ మహోత్సవ్ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్డులో మూడు వందల అడుగుల జాతీయ జెండాతో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది.
300 అడుగుల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ
పాల్గొన్న అధికారులు, విద్యార్థులు, స్థానికులు
విశాఖపట్నం, ఆగస్టు 7: అజాదీకా అమృత్ మహోత్సవ్ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్డులో మూడు వందల అడుగుల జాతీయ జెండాతో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. విక్టర్టీ ఎట్ సీ స్తూపం నుంచి పార్క్ హోటల్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో అధికారులు, ఏఎంసీ విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ చేసిన నినాదాలతో తీరం హోరెత్తింది.
పోలీసు సిబ్బంది బ్యాండ్ ఆకట్టుకుంది. కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా ఈనెల ఒకటి నుంచి నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో ఏడో రోజు ఈ అతి పెద్ద కార్యక్రమం నిర్వహణ ఆనందంగా ఉందన్నారు. పదిహేను వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజలంతా పాలుపంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో విజయ్కుమార్, ఏంఎంసీ ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, స్పోర్ట్స్ అథారిటీ యూత్ సర్వీసెస్ ప్రతినిధి నాగేశ్వరరావు, సమాచార శాఖ డీడీ మణిరామ్ పాల్గొన్నారు.