ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2022-05-17T05:11:43+05:30 IST
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 20 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు.
20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఎస్పీ హర్షవర్ధన్రాజు
రాయచోటి క్రైం, మే 16: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 20 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మాకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు ఎస్డీపీవో శివభాస్కర్రెడ్డి, రైల్వేకోడూరు సీఐ విశ్వనాధరెడ్డిల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజపురం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇతియోస్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులతో పాటు 6 ఎర్రచందనం దుంగలు దొరికాయన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు గంగరాజుపోడు వద్ద మరో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 14 ఎర్రచందనం దుంగలు, టాటామ్యాక్స్ వాహనం బజాజ్ ఆటోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడూరుకు చెందిన సింగమాల సురేష్, గాలితోట జాన్, కోటేశ్వర్, సేళ్ల గంగాధర్, పసుపులేటి బాలాజీలను అరెస్టు చేశామని తెలిపారు. స్మగ్లర్లను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.