సైకిలెక్కిన మౌర్య, సైనీ

ABN , First Publish Date - 2022-01-15T08:08:23+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి, యోగి క్యాబినెట్‌కు రాజీనామా చేసిన మాజీ మం త్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, ధరం సింగ్‌ సైనీ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

సైకిలెక్కిన మౌర్య, సైనీ

మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా..


లఖ్‌నవూ, జనవరి 14: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి, యోగి క్యాబినెట్‌కు రాజీనామా చేసిన మాజీ మం త్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, ధరం సింగ్‌ సైనీ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వీరితోపాటు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు (రోషన్‌లాల్‌ వర్మ, బ్రిజేష్‌ ప్రజాపతి, ముఖేష్‌ వర్మ, వినయ్‌ శక్య, భగవతి సాగర్‌); యూపీలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన అ ప్నాదళ్‌ ఎమ్మెల్యే చౌదరి అమర్‌ సింగ్‌ కూడా ఎస్పీ తీ ర్థం పుచ్చుకున్నారు. వీరంతా సమాజ్‌వాదీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రసాద్‌ మౌర్య మాట్లాడుతూ, ‘‘బీజేపీని అం తం చేయడానికి ఈరోజు శంఖం పూరించాం. దేశ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వారి కళ్లలో బీజేపీ మట్టికొట్టింది. ప్రజలను దోచుకుంది’’ అని అన్నా రు. తాను పార్టీని వీడిన తర్వాత బీఎస్పీ కుప్పకూలిందని, తన వల్లే బీజేపీ పాపులారిటీ యూపీలో పెరిగిందని, ఇక, ఆ పార్టీకి చివరి రోజులొచ్చాయని చెప్పుకొచ్చారు. కాగా, కేవలం మూడు రోజుల్లోనే ముగ్గురు మంత్రులు సహా పదిమంది ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్‌బై చెప్పి.. ఎస్పీకి జైకొట్టిన విషయం తెలిసిందే.


బీజేపీకి మూడు, నాలుగే: అఖిలేశ్‌

యూపీ అసెంబ్లీలో నాలుగింట మూడో వంతు సీట ్లను సాధిస్తామని బీజేపీ చెబుతోందని, కానీ, ఆ పార్టీకి వచ్చేవి 3-4 సీట్లు మాత్రమేనని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ప్రసాద్‌ మౌర్య తదితరులకు పార్టీ కండువా కప్పిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ‘80-20’ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ‘‘ఆయన మాటల అర్థం యూపీ ఎన్నికల్లో కేవలం 20 శాతం మంది బీజేపీకి మద్దతు ఇస్తారని! మిగిలిన 80ు ఎస్పీకే ఓటు వేస్తారు. తాజాగా, ప్రసాద్‌ మౌర్య తదితరులు ఎస్పీలో చేరారు. ఇప్పుడు బీజేపీ ఆ 20ు ఓట్లను కూడా కోల్పోతుంది. యోగి  ఓ లెక్కల మాస్టారిని పెట్టుకుంటే మంచిది’’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ వికెట్లు ఒకదాని తర్వాత మరొకటిగా పడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇటీవల ఎస్పీ మద్దతుదారుడైన అత్తరు వ్యాపారి పుష్పరాజ్‌ జైన్‌ అనుకొని బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి పీయూష్‌ జైన్‌పై ఐటీ దాడులు చేయడాన్ని ‘డిజిటల్‌ ఇండియా ఎర్రర్‌’గా అభివర్ణించారు.


కాగా, బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను చేర్చుకునే కార్యక్రమాన్ని అఖిలేశ్‌ యాదవ్‌ వర్చువల్‌గా ఏర్పాటు చేశారు. కానీ, ఎస్పీ కార్యకర్తలు లఖ్‌నవూలోని పార్టీ ఆఫీసుకు భారీసంఖ్యలో తరలి వ చ్చారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్దఎత్తున గుమిగూడారు. వర్చువల్‌ ర్యాలీ కావడంతో అనుమతి తీసుకోలేదని లఖ్‌నవూ జిల్లా కలెక్టర్‌ చెప్పారు. దాంతో, పోలీసులు కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలోనే, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. 


దళితుడి ఇంట్లో యోగి భోజనం

యూపీలో ఎన్నికలు వచ్చాయి. ఇక, ఇప్పుడు నాయకుల విన్యాసాలూ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం గోరఖ్‌పూర్‌లోని ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. ముగ్గురు మంత్రులు సహా పదిమంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, దళితులకు బీజేపీ వ్యతిరేకమంటూ ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే, సంక్రాంతి సందర్భంగా సీఎం యోగి శుక్రవారం గోరఖ్‌పూర్‌లోని దళితుడు అమృత్‌లాల్‌ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎస్పీ పాలనలో ‘సామాజిక న్యాయా’నికి బదులు ‘సామాజిక దోపిడీ’ జరిగిందని ధ్వజమెత్తారు. 



టికెట్‌ ఇవ్వలేదని.. వెక్కి వెక్కి ఏడ్చిన బీఎస్పీ నేత

లఖ్‌నవూ, జనవరి 14: ఉత్తరప్రదేశ్‌లో వివిధ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. టికెట్లు దక్కని అభ్యర్థుల ఏడుపులు, పెడబొబ్బలు, డ్రామాలూ మొదలయ్యాయి. ముజఫర్‌ నగర్‌ జిల్లాలోని ఛార్థావాల్‌ నియోజకవర్గానికి బీఎస్పీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ సీటును ఆ పార్టీ నేత ఆర్షద్‌ రాణా ఆశించారు. కానీ, తనకు సీటు దక్కకపోవడంతో శుక్రవారం ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని అన్నారు. టికెట్‌ కావాలంటే రూ.67 లక్షలు ఇవ్వాలని రెండేళ్ల కిందట పార్టీ సీనియర్‌ నేత ఒకరు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. 

Updated Date - 2022-01-15T08:08:23+05:30 IST