టీటీడీ బోర్డులో ఐదుగురు
ABN , First Publish Date - 2021-09-17T07:23:04+05:30 IST
తిరుమల-తిరుపతి దేవస్థానాల పాలకమండలిలో జిల్లా నుంచి ఐదుగురికి చోటు లభించింది.
సభ్యుడిగా పోకల అశోక్కుమార్
చెవిరెడ్డికి ఎక్స్ అఫిషియో సభ్యత్వం
ప్రొటోకాల్తో ప్రత్యేక ఆహ్వానితుడిగా భూమన
ప్రత్యేక ఆహ్వానితులుగా బీరేంద్రవర్మ, దయాసాగర్
తిరుపతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల-తిరుపతి దేవస్థానాల పాలకమండలిలో జిల్లా నుంచి ఐదుగురికి చోటు లభించింది. పులిచెర్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు పోకల అశోక్కుమార్ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. తుడా ఛైర్మన్ హోదాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా, స్థానిక ఎమ్మెల్యే హోదాలో భూమన కరుణాకర రెడ్డి ఓటుహక్కు మినహా మిగిలిన ప్రోటోకాల్ సదుపాయాలతో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం దక్కించుకున్నారు. సత్యవేడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు బీరేంద్ర వర్మ, పెనుమూరు వైసీపీ నేత మహాసముద్రం దయాసాగర్రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు ఒకే పాలకమండలిలో జిల్లా నుంచి ఐదుగురికి అవకాశం లభించడం ఇదే తొలిసారి. గతంలో వారణాసి రఘునాధరెడ్డి, రెడ్డివారి నాదమునిరెడ్డి, డీకే ఆదికేశవులు (రెండు సార్లు), భూమన కరుణాకర రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి జిల్లా నుంచి చైౖర్మన్లుగా పనిచేశారు.సభ్యులుగా పలు సందర్భాల్లో జిల్లావాసులున్నా ఒకే బోర్డులో ముగ్గురికి మించి ఎన్నడూ లేరు. ప్రోటోకాల్, ఓటింగ్ వంటి వాటిలో తేడాలున్నప్పటికీ దర్శనాలు, గౌరవాల విషయంలో అందరికీ ఒకే విధమైన సదుపాయాలు అందుబాటులో వుండే అవకాశముంది. ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకపోయినా ఏవైనా టీటీడీ సంబంధ విషయాల్లో, ఆలయాల నిర్మాణాలకు, ధార్మిక కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాల్లో వారి ప్రతిపాదనలను బోర్డు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహిత అనుచరుడైన పోకల అశోక్కుమార్, సత్యవేడు, పెనుమూరు నేతలు బీరేంద్ర వర్మ, దయాసాగర్రెడ్డిలకు అవకాశం దక్కడం పట్ల ఆయా ప్రాంతాలకు చెందిన వారి అనుచరవర్గాలూ, వైసీపీ శ్రేణులూ సంబరపడుతున్నాయి.
చెవిరెడ్డి, కరుణాకర రెడ్డి, ప్రమాణస్వీకారం
తిరుమల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ కొత్త పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడిగా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.శ్రీవారి కృపతో రెండోసారి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. హైందవ ధర్మ సంస్కృతిని, ఆచారాలను కాపాడడంతో పాటు టీటీడీ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు.