నీరు-చెట్టు నిధుల్లో ఫిట్టింగ్!
ABN , First Publish Date - 2022-06-22T07:59:34+05:30 IST
నీరు-చెట్టు నిధుల్లో ఫిట్టింగ్!
జీవోలిస్తారు.. నిధులివ్వరు!
నిధుల విడుదల కాగితాలకే పరిమితం
ఈఈల ఆథరైజేషన్ కోరుతున్న పీఏఓలు
లేకుంటే నిధులు రావని స్పష్టీకరణ
2017 నాటి పనులంటున్న ఈఈలు
కోర్టు చెప్పినా డ్రామాలేనా.. రైతుల ఆవేదన
(అమరావతి, ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు బిల్లుల విడుదల పెద్ద ప్రహసనంగా మారింది. చెల్లింపుల్లో జాప్యంపై ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే ఆదరాబాదరాగా నిధులు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేస్తున్నా.. మైనర్ ఇరిగేషన్ శాఖ ఖాతాల్లోకి మాత్రం నిధులు వెళ్లకపోవడం విస్తుపోయే అంశం. ఈ నిధులు విడుదల చేయాలంటే.. నీరు-చెట్టు కింద చేపట్టిన పనులన్నీ సక్రమేనంటూ మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నుంచి ఆథరైజేషన్ కావాలని పే అండ్ అకౌంట్స్ అధికారు(పీఏవో)లు డిమాండ్ చేస్తున్నారు. ఆథరైజేషన్ ఇవ్వనిదే సీఎ్ఫఎంఎస్ నుంచి నిధుల బదలాయింపు సాధ్యం కాదని ఈఈలకు స్పష్టం చేస్తున్నారు.
అయితే, ఈ పనులన్నీ ఎప్పుడో 2017లో జరిగినవని.. వాటికి అప్పుడే మెజర్మెంట్ బుక్ (ఎం.బుక్)లలో కొలతలు రాసి.. నాటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాటిని తనిఖీ చేసి ధ్రువీకరించారని ఈఈలు చెబుతున్నారు. ఎప్పుడో జరిగిన పనులకు తామిప్పుడు ఆఽథరైజేషన్ ఎలా ఇస్తామని పీఏఓను ప్రశ్నిస్తున్నారు. ఏమైనా ఉంటే.. తమ శాఖ చీఫ్ ఇంజనీర్ల నుంచి ఏయే పనులకు ఎంతెంత మొత్తాలు చెల్లించాలన్న ఆథరైజేషన్ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. పీఏఓకూ.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మధ్య నడుస్తున్న ఈ లడాయితో.. ఆర్థిక ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. నీరు చెట్టు బిల్లులు చెల్లించడం లేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన రైతులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తే.. తాము నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని.. కోర్టులో చెప్పడం కోసమే ఇలాంటి ఉత్తర్వులను జారీ చేస్తున్నారని రైతాంగం ఆరోపిస్తుంది. ఈ నెల ఆరో తేదీన నీరు-చెట్టు పనులు చేసిన రైతాంగానికి బిల్లులు చెల్లించేందుకు వీలుగా రూ.122,44,00,000 విడుదల చేస్తూ ఒక ఉత్తర్వు.. రూ.45,74,00,000 విడుదల చేస్తూ మరో ఉత్తర్వును ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఎస్.ఎ్స.రావత్ ఉత్తర్వు జారీ చేశారు. దీంతో నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వ మూడేళ్ల కక్షకు మోక్షం కలిగిందని రైతాంగం ఊపిరి పీల్చుకుంది.
అయితే.. ఈ కష్టాలు ఇంతటితో సమసిపోలేదని రైతాంగానికి క్రమంగా అర్థమవుతోంది. కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చిన రైతాంగానికి చెల్లించాల్సిన బకాయిల బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలంటూ మైనర్ ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను సీఎ్ఫఎంఎస్ సీఈవో కోరుతున్నారు. ఈ నెల ఆరో తేదీన నిధులు విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకూ కోర్టు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న 529 బిల్లులలో కేవలం 306 మాత్రమే అప్లోడ్ అయ్యాయని వెల్లడించారు. మిగిలిన బిల్లులనూ అప్లోడ్ చేయాలని మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కోరారు. అయితే.. ఈ బిల్లులను అప్లోడ్ చేసేందుకు వెళ్తున్న ఈఈలను ఆథరైజేషన్ ఇవ్వాలని పీఏఓ కోరుతోంది. దీంతో.. ఈ బిల్లులన్నీ పెండింగ్లోనే పడిపోయాయి. దీంతో .. ఆర్థిక శాఖ నిధులు ఇచ్చినట్లు .. పీఏఓ పెండింగ్లో పెడుతున్నట్లుగా కొత్తడ్రామాకు తెరలేచిందంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఖాతాల్లో డబ్బులు వేయండి: సాగునీటి వినియోగదారుల సంఘం సమాఖ్య
నీరు చెట్టు పెండింగ్ బిల్లులపై నిధులు విడుదల చేస్తున్నట్లుగా ఉత్తుత్తి జీవోలు ఇవ్వడం కాదని .. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని ఆర్థిక శాఖను సాగునీటి వినియోగదారుల సంఘం సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ నెల ఆరో తేదీన రూ.168 కోట్లు .. ఈ నెల 19వ తేదీన మరో రూ.200 కోట్లు నిధులు విడుదల చేసినా ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో నిధులు మాత్రం బదిలీ కాలేదని సాగు నీటి వినియోగదారుల సంఘం సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. జాప్యం చేయడం వెనుక దురుద్దేశాలేమైనా ఉన్నాయేమోనని సందేహాన్ని వ్యక్తం చేశారు. కోర్టులో కేసు వాదనలకు వచ్చినప్పుడు నిధులు విడుదల చేస్తూ జీవోలు ఇచ్చేశామని చెప్పేందుకు ఆర్థికశాఖ ఎత్తుగడలు వేసిందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టు ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని గోపాలకృష్ణారావు కోరారు.