వేటకు వేళాయె!
ABN , First Publish Date - 2021-06-14T06:34:12+05:30 IST
సముద్రంలో చేపల వేట విరామం ముగిసింది. సోమవారం రాత్రి నుంచే వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే వలలతో పాటు బోట్లకు మరమ్మతులు చేసుకోవడంతో పాటు డీజిలు టిన్నులు, నిత్యావసర సరుకులను సిద్ధం చేసుకున్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో కొందరు సంకోచిస్తున్నారు.
- నేటితో ముగియనున్న వేట నిషేధ విరామం
- బోట్లు సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు
- వాతావరణం బాగోక జంకుతున్న ఫైబర్ బోట్ల యజమానులు
- పూర్తిస్థాయిలో అందని మత్స్యకార భరోసా
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జూన 13: సముద్రంలో చేపల వేట విరామం ముగిసింది. సోమవారం రాత్రి నుంచే వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే వలలతో పాటు బోట్లకు మరమ్మతులు చేసుకోవడంతో పాటు డీజిలు టిన్నులు, నిత్యావసర సరుకులను సిద్ధం చేసుకున్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో కొందరు సంకోచిస్తున్నారు. దీనికి తోడు తుఫాను ప్రభావంతో సముద్రంలో వాతావరణం బాగోక వేటకు పంపేందుకు ఫైబర్ బోట్ల యజమానులు జంకుతున్నారు. రెండు నెలల వేట నిషేధంతో కాకినాడ ఫిషింగ్ హార్బర్. ఐ.పోలవరం మండలం బైరవపాలెం, అల్లవరం మండలం ఓడలరేవు వద్ద చేపల జెట్టీ వెలవెలబోయాయి. బోట్లన్నీ తీరంలో లంగరేసి దర్శనమిచ్చాయి. ఇక ఒకే బోటులో 6 నుంచి 10 మంది వేటకు వెళ్లడం, దొరికిన మత్య్స సంపదను ఒడ్డుకు తెచ్చి వేలం వేసే సమయంలో వ్యాపారులు గుమిగూడారు. దీంతో కొనుగోలు చేసే సమయంలో పాజిటివ్ కాంట్రాక్టు కేసుల వ్యక్తుల ద్వారా పలువురు కొవిడ్ బారిన పడి మృతి చెందారు. దీంతో ఆయా మత్స్యకార కుటుంబాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల మత్య్సకార భరోసా కూడా పూర్తిస్థాయిలో అందలేదనే విమర్శలు ఉన్నాయి.