మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు
ABN , First Publish Date - 2020-08-05T09:28:23+05:30 IST
మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వంద కోట్ల ప్రత్యే క ప్రణాళికను అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వంద కోట్ల ప్రత్యే క ప్రణాళికను అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మత్స్య సమీకృత అభివృద్ధి పథకం అమలు తీరుపై ఆమె మంగళవారం తన ఛాంబర్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.52 కోట్ల ఖర్చుతో 82 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయబోతున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలో రూ.50 లక్షలతో కోటి ఆరు లక్షల చేపపిల్లలను అందజేయనున్నట్లు చెప్పారు.
వీటిని జిల్లాలోని 536 చెరువుల్లో వేయాలని నిర్ణయించగా ప్రస్తుతం 180 చెరువుల్లో మొదటి దశలో వేయనున్నట్లు చెప్పారు. వికారాబాద్ జిల్లాలో 509 చెరువుల్లో కోటి 11 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయిం చామన్నారు. వంద శాతం గ్రాంట్తో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని, 75 శాతం రాయితీతో చేపలు అమ్ముకునేందుకు వాటిని అందిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి, దుర్గాప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.