సరిహద్దలో మత్స్యకారులు
ABN , First Publish Date - 2020-03-29T11:18:07+05:30 IST
లాక్డౌన్ ప్రకటనతో కర్ణాటకరాష్ట్రంలోని మంగుళూరు ప్రాంతాలకు చేపలవేట బోట్లకు డ్రైవర్లుగా, కూలీలుగా వెళ్లిన కావలి ప్రాంత
కావలి, మార్చి 28 : లాక్డౌన్ ప్రకటనతో కర్ణాటకరాష్ట్రంలోని మంగుళూరు ప్రాంతాలకు చేపలవేట బోట్లకు డ్రైవర్లుగా, కూలీలుగా వెళ్లిన కావలి ప్రాంత మత్స్యకారులు తిరుగుముఖం పట్టి కర్నాటక- ఆంరఽధ సరిహద్దులో చిక్కుకున్నారు. పలమనేరు టోల్గేట్ వద్ద సుమారు 2,700 మంది ఉన్నారు. వారిలో 2వేల మంది కావలిప్రాంత మత్స్యకారులే ఉన్నట్లు ఈ ప్రాంత నాయకులు చెపుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం అక్కడ నుంచి పంపినా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో వారు సరిహద్దులో ఉండిపోయారు.
దాంతో ఆ సమస్యను మత్స్యకారనాయకులు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్పకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తాన్రావు, కాటంరెడ్డి విష్ణువర్థన్రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి వారిని పంపేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అప్పటివరకు వారికి భోజన ఏర్పాట్లు చేస్తే అవపసరమైతే ఆ నిధులు తాము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు మాట్లాడుతూ సరిహద్దులో ఉన్న మత్స్యకారులకు ఆహారం అందచేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో మాట్లాడాననితెలిపారు.
బోగోలు వాసులే 600 మంది
పలమనేరు పలమనేరు టోల్గేట్ వద్ద బోగోలు వాసులే సుమారు 600 మందికిపైగా ఉన్నారు. బంగారుపాళెంకు చెందిన మత్స్యకారుడు వెంకటేశ్వర్లు శనివారం మాట్లాడుతూ మండలంలోని జువ్వలదిన్నె పంచాయతీలోని పాత, కొత్త కడపాళెం, అలిచర్ల, కొత్త బంగారు పాళెం, టెంకాయి చెట్ల పాళెం కు చెందిన 350 మంది, సీఆర్పాళెం పంచాయితీకి చెందిన చిన్న, పెద్ద పాతపాలెంలు, తాటిచెట్లపాలెంకు చెందిన 260 పైగా ఉన్నారని అన్నారు.
వారికి ఆరోగ్య పరీక్షలు చేసి జిల్లాకు తీసుకొచ్చి ఐసోలేషన్లోన్లో, ఇతర ప్రాంతంలోనో ఉంచి ఆహారం అందించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్కుమార్, నేత పసుపులేటి సుధాకర్ల దృష్టికి తీసుకు పోగా చిత్తూరు బీజేపీ నాయకుడు సుబ్బారెడ్డితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పినట్లు తెలిపారు.