ఎగుమతులపైనే మత్స్యకారుల అభ్యున్నతి

ABN , First Publish Date - 2022-05-20T05:42:05+05:30 IST

మత్స్య సంపద ఎగుమతులు పెరిగితేనే మత్స్యకారుల ఆదాయాలు పెరిగి వారి జీవితాలు గాడిలో పడతాయని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

ఎగుమతులపైనే మత్స్యకారుల అభ్యున్నతి
వన్‌టౌన్‌ జాలరిపేట మత్స్యకారులతో మాట్లాడుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఆదాయం పెరగాలంటే అదే మార్గం

‘సిటిజన్‌ రిపోర్టు కార్డు’ కార్యక్రమంలో  మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం, మే 19: మత్స్య సంపద ఎగుమతులు పెరిగితేనే మత్స్యకారుల ఆదాయాలు పెరిగి వారి జీవితాలు గాడిలో పడతాయని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. మద్యం, మత్తు పదార్థాల బారినపడి మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ‘సిటిజన్‌ రిపోర్టు కార్డు’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన విశాఖనగరం వన్‌టౌన్‌ జాలరిపేటలో పర్యటించారు.


మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషాతో భేటీ అయి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారుల భరోసా లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని, పింఛన్‌ లబ్ధిదారులూ తగ్గిపోయారని గుర్తించామన్నారు.


చాలామంది మహిళలకు వృద్ధాప్య పింఛన్లు అందడం లేదన్నారు. జాలరిపేటలో డ్రైనేజీ సమస్య కూడా దారుణంగా ఉందని కాలువల్లో నీరు ఇళ్లలోకి వస్తోందని చెప్పారు. ప్రభుత్వ రాయితీలు పెద్దగా ఉపయోగపడడం లేదని, ధరల పెరుగుదలకు అనుగుణంగా రాయితీలు పెంచాలని కోరారు. రెగ్యులర్‌గా విద్యుత్‌ కోత అమలవుతున్నట్లు గుర్తించామన్నారు  

Updated Date - 2022-05-20T05:42:05+05:30 IST