అంపైర్లలో ఒకరికి కరోనా.. ఐర్లాండ్-యూఎస్ఏ తొలి వన్డే రద్దు
ABN , First Publish Date - 2021-12-26T00:17:26+05:30 IST
మూడు వన్డేల సిరీస్లో భాగంగా యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య రేపు (ఆదివారం) జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. అంపైర్లలో ..
ఫ్లోరిడా: మూడు వన్డేల సిరీస్లో భాగంగా యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య రేపు (ఆదివారం) జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. అంపైర్లలో ఒకరికి కరోనా సోకడంతో మ్యాచ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగతా ముగ్గురు అంపైర్లకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలినప్పటికీ కొవిడ్ సోకిన అంపైర్తో వారు కలిసి ఉండడంతో వారిని కూడా ఐసోలేషన్కు తరలించారు.
అంప్లైర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వన్డే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ఇరు బోర్డులు ప్రకటించాయి. సిరీస్లో భాగంగా 28, 30వ తేదీల్లో జరగాల్సిన మిగతా రెండు వన్డేలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు. కాగా, అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో రెండు జట్లు చెరో మ్యాచ్లో నెగ్గడంతో సిరీస్ డ్రా అయింది.
మ్యాచ్ రద్దయినంత మాత్రాన ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని తర్వాతి మ్యాచ్కు ఉపయోగించుకోవచ్చని యూఎస్ఏ క్రికెట్ తెలిపింది. అయితే, ఆ తర్వాతి మ్యాచులకు కూడా ఆ టికెట్ను ఉపయోగించుకోకుంటే వారం రోజుల్లో టికెట్ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపింది.