తొలిసారిగా ఆన్లైన్లో వైద్య కోర్సుల కౌన్సెలింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-02-03T14:17:09+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వైద్యకోర్సుల కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆన్లైన్లో కౌన్సెలింగ్ జరగడం విశేషం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న 4,319 సీట్ల
పెరంబూర్(చెన్నై): రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వైద్యకోర్సుల కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆన్లైన్లో కౌన్సెలింగ్ జరగడం విశేషం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న 4,319 సీట్లలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేటాయించిన 324 సీట్లు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో భర్తీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గత నెల 27న కౌన్సెలింగ్ ప్రారంభమైంది. స్థానిక ఓమందూర్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తొలిరోజు ప్రత్యేక విభాగాలకు నిర్వహించిన కౌన్సెలింగ్లో 73 మంది సీట్లు పొందారు. అనంతరం 28వ తేది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేటాయించిన 7.5 శాతం రిజర్వేషన్ కేటాయింపు ప్రకారం 541 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ రెండు విభాగాల కౌన్సెలింగ్ ప్రత్యక్షంగా నిర్వహించారు. జనరల్ కౌన్సెలింగ్లో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనే అవకాశముండడంతో ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణ యించారు. ఆ ప్రకారం గత 30వ తేది ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు ప్రకటించగా, అఖిల భారత సీట్ల తొలివిడత కౌన్సెలింగ్ ఫలితాలు వెలువ డకపోవడంతో రాష్ట్రంలో నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఆలస్యంగా బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన కౌన్సెలింగ్ ఈ నెల 5వ తేది వరకు జరుగనుంది. 7న సర్టిఫికెట్ల పరిశీలన కోసం విద్యార్థులకు కాల్ లెటర్స్ పంపి, 8 నుంచి 10వ తేది వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. 15వ తేది సీట్ల కేటాయింపు వివరాలు ఆన్లైన్లో విడుదల చేయనుండగా, 16న విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల వెబ్సైట్ నుంచి అడ్మిషన్ పత్రాలు పొందవచ్చు. అనంతరం 17 నుంచి 22వ తేది మధ్యాహ్నం 3 గంటల్లోపు విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సి ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల్లోని 3,995 సీట్లు, స్వయం ప్రతిపత్తి కళాశాల్లోని 1,390 సీట్లు భర్తీ కానున్నాయి. అలాగే, ప్రభుత్వ దంత వైద్యకళాశాలల్లో 157, స్వయం ప్రతిపత్తి కళాశాల ల్లోని 1,166 బీడీఎస్ సీట్లు ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ కానున్నాయి.