రసపట్టులో..
ABN , First Publish Date - 2020-08-08T09:18:27+05:30 IST
ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడో రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లదే హవా
పాక్ రెండో ఇన్నింగ్స్ 137/8
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 219 ఆలౌట్
మాంచెస్టర్: ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడో రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లదే హవా సాగగా ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (4/66) మ్యాజిక్ బంతులకు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 70.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. ఒల్లీ పోప్ (62), బట్లర్ (38) రాణించగా.. పాక్కు 107 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ను ఈసారి ఇంగ్లండ్ బౌలర్లు చెక్ పెడుతూ ఆఖరి సెషన్లోనే 8 వికెట్లు పడగొట్టారు. ఫలితంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. బ్రాడ్, స్టోక్స్, వోక్స్ రెండేసి వికెట్లు తీశారు. అయితే ప్రస్తుతం పాక్ జట్టు 244 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో ఫలితం తేలడం ఖాయమే. అంతకుముందు 92/4 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ను పాక్ పేసర్లు ఇబ్బందిపెట్టారు. పోప్, బట్లర్ ఐదో వికెట్కు 65 పరుగులు జత చేర్చారు. రెండో సెషన్లో స్పిన్నర్లు యాసిర్, షాదాబ్ విజృంభణకు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది.