చేదోడు కొందరికేనా?
ABN , First Publish Date - 2020-06-03T10:26:52+05:30 IST
వైఎస్సార్ చేదోడు అందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ కారణాలతో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య..
చేతివృత్తిదారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం ‘వైఎస్సార్ చేదోడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10 వేలు వంతున సాయం అందించేందుకు నిర్ణయించింది. ఇందుకుగాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. దీంతో ఆయా వర్గాల వారు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. సాయం అందుతుందని కొండంత ఆశతో ఉన్నారు. కానీ అర్హులకు మొండిచేయి చూపుతూ దరఖాస్తులను తొలగించడంతో ఆందోళన నెలకొంది.
వైఎస్సార్ చేదోడు తొలి సర్వేలో అందరికీ చోటు
రెండోసారి నిబంధనల పేరిట సగం మంది తొలగింపు
అర్హులకు మొండిచేయి
ఆందోళనలో లబ్ధిదారులు
(ఇచ్ఛాపురం రూరల్): వైఎస్సార్ చేదోడు అందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ కారణాలతో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో అనేకమంది నిరాశ చెందుతున్నారు. ఈ ఏడాది జనవరిలో నవశకం పేరుతో వలంటీర్లు సర్వే చేపట్టారు. రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులు ఈ మూడు కేటగిరిల్లో 32,635 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీనిపై ఫిబ్రవరి 20న మరోసారి సర్వే చేశారు.
మార్చి 17న అర్హుల జాబితా ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం సచివాలయాల్లో రీ సర్వే ద్వారా గుర్తించిన లబ్ధిదారుల జాబితాలను ప్రచురిస్తున్నారు. కానీ ముందుగా గుర్తించిన 32,635 మందిలో 15,543 మంది మాత్రమే అర్హులుగా తేలారు. మిగిలిన 17,092 మందిని తొలగించారు. అభ్యంతరాల స్వీకరణ, చివరకు జాబితాను ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు బీసీ కార్పొరేషన్ ఈడీకి సమర్పిస్తారు.
అనంతరం కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి పంపనున్నారు. జూన్ 10 నాటికి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నిధులు జమచేసే అవకాశాలున్నాయి. వైఎస్సార్ చేదోడు పథకానికి 21 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఆధార్, రేషన్, కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలతోపాటు రూ. 10 వేల లోపు నెలసరి ఆదాయమున్న వారు, కార్మిక శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొంది ఉన్నవారు అర్హులు. కానీ తొలి సర్వేలో చోటు దక్కించుకున్న వారిలో 17,092 మందిని రెండోసారి సర్వేలో అనర్హులుగా తేల్చారు. కానీ ఇందులో నిరుపేదలే అధికం. ముఖ్యంగా టైలర్ల విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతోంది.
సాధారణంగా టైలర్లు అద్దెకు షాపులు తీసుకొని నిర్వహిస్తుంటారు. కొందరైతే ఇంట్లోనే పనులు చేసుకుంటారు. కానీ నిబంధనల పేరిట దుకాణాలుండే వారికే ప్రాధాన్యమివ్వడంతో నిరుపేద టైలర్లు నష్టపోయే అవకాశం ఉంది. రజకుల్లోనూ లాండ్రి ఉన్న వారికే ప్రాధాన్యం కల్పించారు. దాంతో తొలుత ఆప్లోడ్ చేసిన లబ్ధిదారుల కన్నా వివిధ నిబంధనలతో రీ సర్వే చేశారు. ఆయా వృత్తిదారుల వద్దకు సంక్షేమ కార్యదర్శి వెళ్లి సంబంధిత యూనిట్తో ఫొటో తీసి జియోట్యాగింగ్ చేసి నమోదు చేపట్టారు. కొన్ని దుకాణాలకు జియో ట్యాగింగ్ చేయలేదు. దాంతో భారీగా లబ్ధిదారులకు కోత పడినట్లు వృత్తిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అర్హులందరికీ అందిస్తాం.. జి.రాజారావు, బీసీ కార్పొరేషన్ ఈడీ
అర్హులందరికీ ‘వైఎస్సార్ చేదోడు’ అందిస్తాం. ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరించాం. రీ సర్వేలో దుకాణాలు ఉండేవారిని పరిగణనలోకి తీసుకున్నాం. వీటిని జియో ట్యాగింగ్ వంటి అంశాలతో రీ సర్వే చేయించాం. అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా వారి ఖాతాకే నగదు జమ అవుతుంది.
లబ్ధిదారుల వివరాలు
పథకం తొలుత గుర్తించినవి రీ సర్వేలో గుర్తించినవి
రజకులు 12,165 7131
నాయీబ్రహ్మణులు 5323 3357
టైలర్లు 15,147 5055
మొత్తం 32,635 15,543