ఓటమితో మొదలెట్టారు!
ABN , First Publish Date - 2021-03-08T09:27:23+05:30 IST
రోనా కారణంగా ఏడాది విరామం తర్వాత ఆడిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్లతో సౌతాఫ్రికా చేతిలో ఓడింది.
తొలి వన్డేలో సౌతాఫ్రికా గెలుపు
మిథాలీ అర్ధ సెంచరీ వృథా
లఖ్నవ్: కరోనా కారణంగా ఏడాది విరామం తర్వాత ఆడిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్లతో సౌతాఫ్రికా చేతిలో ఓడింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత కెప్టెన్ మిథాలీ రాజ్ (50) అర్ధ సెంచరీతో ఆదుకోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు సాధించింది.
హర్మన్ప్రీత్ కౌర్ 40, దీప్తి శర్మ 27 రన్స్ చేశారు. హర్మన్కు ఇది వందో వన్డే కావడం విశేషం. టాపార్డర్లో జెమీమా రోడ్రిగ్స్ (1), స్మృతి మంధాన (14), పూనమ్ రౌత్ (10) విఫలమయ్యారు. షబ్నిమ్ ఇస్మాయిల్ (3/28) మూడు వికెట్లు తీసింది. అనంతరం లీజెల్ లీ (83 నాటౌట్), లారా వోల్వార్డ్ (80) అర్ధ సెంచరీలతో విజృంభించడంతో సఫారీలు 40.1 ఓవర్లలో 178/2 స్కోరు చేసి గెలుపొంది.. 1-0తో సిరీ్సలో ఆధిక్యం అందుకుంది. లీజెల్-లారా తొలి వికెట్కు 169 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్పై సౌతాఫ్రికాకు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. జులన్ గోస్వామి (2/38) రెండు వికెట్లు తీసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.