గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు

ABN , First Publish Date - 2021-10-20T06:39:34+05:30 IST

అరకులోయ చేపల మార్కెట్‌ సమీపంలో నివాసం ఉంటున్న గడ్డం నరసింగరావు ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు చెలరేగాయి.

గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు
గ్యాస్‌ సిలిండర్‌ మంటలను అదుపు చేస్తున్న కానిస్టేబుల్‌ వాసు


కానిస్టేబుల్‌ వాసు సాహసంతో తప్పిన ప్రమాదం

ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు

అరకులోయ, అక్టోబరు 19: అరకులోయ చేపల మార్కెట్‌ సమీపంలో నివాసం ఉంటున్న గడ్డం నరసింగరావు ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు చెలరేగాయి. కానిస్టేబుల్‌ వాసు సాహసం చేసి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

అరకులోయ పట్టణంలోని గడ్డం నరసింగరావు ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు చెలరేగాయి. అదే సమయంలో మెయిన్‌రోడ్‌లో ట్రాఫిక్‌ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ వాసు, స్థానికులతో కలిసి ఇంట్లో ఉన్న వారందర్నీ బయటకు పంపి తడి గోనెలతో మంటలను అదుపు చేశారు. అనంతరం సిలిండర్‌ నుంచి గ్యాస్‌ రాకుండా కట్టడి చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు కాలిపోయాయి. ఈ సందర్భంగా రాణీ,రత్నం అనే మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ వాసు సాహసాన్ని పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, మాజీ వైస్‌ ఎంపీపీ అమ్మన్న, తదితరులు అభినందించారు. 

Updated Date - 2021-10-20T06:39:34+05:30 IST