అగ్నిపథ్ నియామకాలు షురూ
ABN , First Publish Date - 2022-06-25T08:43:24+05:30 IST
అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళంలో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విండోను అధికారులు ప్రారంభించారు.
ఎయిర్ఫోర్స్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
న్యూఢిల్లీ/గ్వాలియర్, జూన్ 24: అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళంలో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విండోను అధికారులు ప్రారంభించారు. ‘‘శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘అగ్నివీర్వాయు’ రిజిస్ట్రేషన్ విండో ప్రారంభమైంది’’ అని భారత వాయుసేన ట్వీట్ చేసింది. ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పఽథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎన్సీసీకి బోనస్ పాయింట్లు
అగ్నిపథ్లో చేరే నేషనల్ కేడెట్ కార్ప్స్(ఎన్సీసీ)కు బోనస్ పాయింట్లు ఇవ్వనున్నట్టు ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గురుబిర్పాల్ సింగ్ తెలిపారు. ఎన్సీసీ మహిళా అధికారుల స్నాతకోత్సవంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకం యువతకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
నవీన భారతం అంటే ఇదే: రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘నవీన భారతం అంటే.. ‘స్నేహితులు’ మాత్రమే వింటారు. ఈ దేశ హీరోలు మాత్రం కాదు’’ అని ట్వీట్ చేశారు. ‘అగ్నిపథ్’పై పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బనా సింగ్ చేసిన విమర్శనాత్మక ట్వీట్ను రాహుల్ ఉటంకించారు. ‘‘ఒకవైపు ఆయన దురహంకారం, నియంతృత్వం. మరొకవైపు దేశ పరమవీర్ కనిపిస్తారు’’ అని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘‘అగ్నివీరులకు పింఛన్ పొందే హక్కు లేదు. నేను కూడా పింఛన్ పొందే హక్కును వదులుకుంటా’’ అని బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ సంచలన ట్వీట్ చేశారు.