దుర్గా పూజా మంటపంలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-10-04T09:42:30+05:30 IST
ఉత్తరప్రదేశ్లో దసరా వేడుకల వేళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
హాలోజన్ లైట్ వేడెక్కి మంటలు.. ఐదుగురి మృతి
భదోహీ (యూపీ), అక్టోబరు 3: ఉత్తరప్రదేశ్లో దసరా వేడుకల వేళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భదోహీ జిల్లా నథువా గ్రామంలో దుర్గా పూజా మంటపంలో ఆదివారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మరణించారు. 64 మందికి గాయాలయ్యాయి. మంటపంలో ఏర్పాటు చేసిన హాలోజన్ లైట్ బాగా వేడెక్కిపోవడంతో మంటలు రేగాయి. నిమిషాల్లో మంటపమంతా వ్యాపించాయి. చెక్కలతో నిర్మించిన వేదిక, టెంట్ బూడిదైపోయాయి. ఆ సమయంలో డిజిటల్ షో వేస్తున్నారు. అక్కడ 300 మందికి పైగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో అంకుష్ జోషి (12), జయదేవి (45), నవీన్ (10) సజీవ దహనమయ్యారు. ఆర్తి చౌబే (48), హర్షవర్ధన్ (8) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మంటప కమిటీ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.