ప.గో.జిల్లాలో బోరు నుంచి మంటలు
ABN , First Publish Date - 2020-05-29T18:47:46+05:30 IST
ఆచంట మండలం, కోనపోతుగుంటలో బోరు నుంచి గ్యాస్ లీకవడం కలకలం రేపుతోంది.
ప.గో.జిల్లా: ఆచంట మండలం, కోనపోతుగుంటలో బోరు నుంచి గ్యాస్ లీకవడం కలకలం రేపుతోంది. బండి ఏసు అనే వ్యక్తి తాగునీటి అవసరాల కోసం ఇంట్లో బోరు వేయించాడు. అయితే బోరు నుంచి నీళ్లతోపాటు పెద్ద శబ్దంతో గ్యాస్ కూడా బయటకు వచ్చింది. అది గ్యాసో కాదో నిర్ధారించుకోడానికి మండించి చూశాడు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు.
సంఘటనా ప్రదేశానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయినా బోరు నుంచి నీళ్లు వాటంతటవే వస్తున్నాయి. చేతి పంపును తొలగించాక కూడా నీళ్లు వస్తునే ఉన్నాయి. గ్యాస్ లీకేజీ అవుతున్నందునే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆందోళనలో ఉన్నారు. అధికారులు కూడా అదే అనుమానిస్తున్నారు. సహజవాయువు లీకేజీ అవుతుందన్న అనుమానంతో ఓఎన్జీసీ అధికారులకు విషయం తెలిపారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక అధికారులకు ఓఎన్జీసీ అధికారులు సూచించారు.