భోపాల్ హాస్పిటల్ ఐసీయూలో Fire breaks out...నలుగురు పిల్లల మృతి
ABN , First Publish Date - 2021-11-09T12:41:42+05:30 IST
మధ్యప్రదేశ్లోని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలోని పిల్లల ఐసీయూ వార్డులో సోమవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది....
భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలోని పిల్లల ఐసీయూ వార్డులో సోమవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఈ అగ్నిప్రమాదంలో చికిత్స పొందుతున్న నలుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రి భవనంలోని మూడవ అంతస్తులోని పీడియాట్రిక్ ఐసీయూలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగినపుడు కనీసం 40 మంది పిల్లలు ఐసీయూ వార్డులో ఉన్నారు. వారిలో 36 మంది పిల్లల్ని మరో వార్డుకు తరలించారు. నలుగురు పిల్లలను కాపాడలేకపోయారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
భోపాల్లోని కమలా నెహ్రూ హాస్పిటల్లోని పిల్లల వార్డులో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమని, రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి మహ్మద్ సులేమాన్ దర్యాప్తు చేస్తారని సీఎం చెప్పారు. మంటలను అదుపులోకి తెచ్చామని, అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
‘‘పిల్లలు ఈ లోకం నుంచి నిష్క్రమించడం భరించలేని బాధ.. మరణించిన పిల్లల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అని సీఎం ట్వీట్ చేశారు.