యూసీఐఎల్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-01-16T05:44:10+05:30 IST

పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం కార్పొరేషన ఆఫ్‌ ఇండియా (యూసీఐఎల్‌)లో అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగితే యూసీఐఎల్‌ సాయంత్రం వరకు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడింది.

యూసీఐఎల్‌లో అగ్నిప్రమాదం
యూసీఐఎల్‌లో అగ్నిప్రమాదంతో ఏర్పడిన పొగ

భయాందోళనలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు

ప్రమాదం జరిగినా బయటకు పొక్కనీయని యూసీఐఎల్‌

పులివెందుల, జనవరి 15: పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం కార్పొరేషన ఆఫ్‌ ఇండియా (యూసీఐఎల్‌)లో అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగితే యూసీఐఎల్‌ సాయంత్రం వరకు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడింది. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2006లో ఎం.తుమ్మలపల్లె వద్ద రూ.1104 కోట్లతో యూసీఐఎల్‌ ఏర్పాటుచేశారు. 2008లో కర్మాగారం పనులు పూర్తిచేసుకొని యురేనియం శుద్ధి పనులు ప్రారంభించింది. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాలైన ఎం.తులమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, కేకే కొట్టాల, కనంపల్లె తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. శుద్ధికర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలను టెయిలింగ్‌పాండ్‌లో నిల్వ చేస్తున్నారు. దీని వల్ల వాతావరణం, భూగర్భజలాలు ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని అక్కడి ప్రజలు నిత్యం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనట్లు ప్రజలు చెబుతున్నారు. మరోపక్క టెయిలింగ్‌పాండ్‌తో భూగర్భజలాలు కూడా కలుషితమై పంట పొలాలు నాశనం అవుతున్నాయని పెద్దఎత్తున రైతులు ఆందోళనలు కూడా చేశారు. ఇటువంటి సందర్భంలో శుక్రవారం జరిగిన ప్రమాదం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తమ బతుకులు ఏమవుతాయోనని ప్రజలు వాపోతున్నారు.

అణుబాంబులకు వాడే  ముడి యురేనియాన్ని శుద్ధిచేసి ఈ కర్మాగారంలోనే 15రోజుల పాటు నిల్వ చేస్తారు. ప్రతి 15రోజులకు ఒకసారి ముడి యురేనియాన్ని ఎగుమతి చేస్తూ వస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వ ఉన్న ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే తమ బతుకులు ఏమవుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండవ ప్లాంట్‌ ఏర్పాటుకు యూసీఐఎల్‌ సన్నాహాలు చేస్తుంటే దానిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. జనవరి 6న జరగాల్సిన ప్రజాభిప్రాయాన్ని కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆపివేశారు. ఇంత ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో యూసీఐఎల్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తోంది. కానీ యూసీఐఎల్‌ అధికారులు మాత్రం షార్ట్‌సర్క్యూట్‌ వలనే ప్రమాదం సంభవించిందని ఎలాంటి ప్రమాదం లేదని కొట్టిపారేస్తున్నారు. ఏదిఏమైనా శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదం యూసీఐఎల్‌ పరిసర గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందనే చెప్పాలి.  

Updated Date - 2021-01-16T05:44:10+05:30 IST