నాయుడుపేట టీడీపీ కార్యాలయానికి నిప్పు
ABN , First Publish Date - 2022-05-24T08:58:22+05:30 IST
నాయుడుపేట టీడీపీ కార్యాలయానికి నిప్పు
ఫర్నిచర్ను ధ్వంసం చేసిన దుండగులు
నాయుడుపేట, మే 23: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి నిప్పంటించారు. టీడీపీ నాయకుడు గంగబాబు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి కార్యాలయాన్ని మూసివేసి బయట వరండాలో ఆయన కూర్చుని ఉండగా మోటారు సైకిల్పై ముగ్గురు యువకులు వచ్చి దుర్భాషలాడారు. కొంత సమయం తర్వాత ఆయన బస్టాండ్ ప్రాంతంలోకి వెళ్లగా టీడీపీ కార్యాలయానికి నిప్పంటించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారని గంగబాబుకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో తాను పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినట్టు వివరించారు. ఆ యువకులు అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.