విశాఖ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఎన్నో అనుమానాలు!

ABN , First Publish Date - 2020-08-05T15:58:20+05:30 IST

అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లోని విజయ శ్రీ కంపెనీలో ప్రమాదం సంభవించగా... అధికారులు దానిపై సరైన సమాచారం వెల్లడించలేదు. అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

విశాఖ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఎన్నో అనుమానాలు!

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లోని విజయ శ్రీ కంపెనీలో  ప్రమాదం సంభవించగా... అధికారులు దానిపై సరైన సమాచారం వెల్లడించలేదు. అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అది మందులు తయారు చేసే కంపెనీయా? వ్యర్థాలను శుద్ధి చేసే కంపెనీయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. నిల్వ చేసిన వ్యర్థాలు బయటకు వచ్చి కాలువలో కలిసిపోయాయని, అందులో ఎవరో సిగిరెట్‌ తాగి పడేస్తే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మందులు తయారు చేసే కంపెనీ అయితే వ్యర్థాలను బయటకు తరలించాలి. స్టోరేజీ ట్యాంక్‌ నిండిపోయి, బయటకు వచ్చి కాలువలో కలిసిపోయేంత వరకు దానిని యాజమాన్యం గుర్తించ లేదంటే... అది చాలా పెద్ద తప్పు. రసాయన వ్యర్థాలను అలా బయటకు వదలకూడదు. అలా కాకుండా ఆ కంపెనీ వ్యర్థాలను శుద్ధి చేసేదైతే... ఆ పని చాలా పకడ్బందీగా చేయాలి. బయటకు వాటిని విడిచిపెట్టకూడదు.


ప్రమాదం తీవ్రత తగ్గించి చూపుతున్నారు 

ప్రమాదం జరిగినప్పుడు పెద్ద పేలుడు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. మంటలు కూడా పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ఆకాశంలోకి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. కానీ ప్రమాదం పెద్దది కాదని, రెండు ద్విచక్ర వాహనాలు కాలిపోతే... వాటిని స్థానిక అగ్నిమాపకదళం వచ్చి ఆర్పేసిందని చెబుతున్నారు. వాహనాలు కూడా పూర్తిగా దహనం కాలేదు. అంటే ప్రమాదం బయట కాకుండా లోపల జరిగిందని, అదేమిటో వెల్లడించడం లేదని అర్థమవుతున్నది. దీనిపై జిల్లా అధికారులు, పరిశ్రమల అధికారులు దృష్టి పెడితే తప్ప విషయం బయటకు వచ్చే అవకాశం లేదు.

Updated Date - 2020-08-05T15:58:20+05:30 IST