దీపం అంటుకుని బీరువాలో సామగ్రి దగ్ధం
ABN , First Publish Date - 2020-12-01T05:21:43+05:30 IST
దీపం అంటుకుని బీరువాలో సామగ్రి దగ్ధం
ధారూరు: కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా పూజ గదిలో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు బీరువాకు అంటుకుని అందులో ఉన్న నగదు, బంగారం, దుస్తులు కాలిపోయాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మున్నూర్సోమారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెలుగు రవి ఇంట్లోని పూజ గదిలో కార్తీక సోమవారం సందర్భంగా పూజ చేసి దీపం వెలిగించిన అనంతరం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు దీపం బీరువా కింద అంటుకుని మంటలు లోపలికి వ్యాపించాయి. ఇంట్లో నుంచి పొగలు బయటకు రావటం గమనించిన చుట్టుపక్కల వారు ఇంటిపైకి ఎక్కి మండలను ఆర్పేసి ఇంటి వారికి సమాచారమిచ్చారు. వారు పొలం నుంచి వచ్చి ఇంటి తాళం తీసి చూడగా బీరువా దగ్థమైంది. బీరువాలో ఉన్న అర తులం బంగారం, రూ. 20 వేలనగదు, బంధువుల పెళ్లికి తీసుకువచ్చిన చీరలు, ట్రాక్టర్, ఆటోలకు సంబంధించిన పత్రాలు, విద్యార్హత పత్రాలు కాలిపోయాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.