మాస్క్ లేకుంటే రూ.1000 జరిమానా: సీఎం
ABN , First Publish Date - 2020-08-10T20:19:51+05:30 IST
కోవిడ్ భయాలను, జరిమానాలను కూడా లెక్కచేయకుండా మాస్క్ ధరించకుండా తిరుగుతున్న..
గాంధీనగర్: కోవిడ్ భయాలను, జరిమానాలను కూడా లెక్కచేయకుండా మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరోసారి షాక్ ఇచ్చారు. మాస్క్ లేని వారి నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.500 జరిమానాను రూ.1000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇది ఈనెల 11 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
దీనికి ముందు, మాస్క్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై విధించే రూ.200 జరిమానాను రూ.500కు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి కూడా వచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, గుజరాత్ రాష్ట్రంలో 14,147 కరోనా యాక్టివ్ కేసులుండగా, 54,166 మంది పేషెంట్లు పూర్తి స్వస్థతతో డిశ్చార్చి అయ్యారు. మృతుల సంఖ్య 2,652కు చేరింది.