RBI Banknotes: భారత కరెన్సీ నోట్లపై త్వరలో ఆ ఇద్దరు ప్రముఖుల ఫొటోల ముద్రణ.. వాళ్లిద్దరూ ఎవరంటే..

ABN , First Publish Date - 2022-06-05T20:26:20+05:30 IST

భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం. కానీ.. త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని..

RBI Banknotes: భారత కరెన్సీ నోట్లపై త్వరలో ఆ ఇద్దరు ప్రముఖుల ఫొటోల ముద్రణ.. వాళ్లిద్దరూ ఎవరంటే..

న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం. కానీ.. త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇద్దరిలో ఒకరు బెంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కాగా, మరొకరు దేశం గర్వించదగ్గ మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. కొత్తగా ఆర్‌బీఐ విడుదల చేయనున్న కొన్ని డినామినేషన్ బ్యాంకు నోట్లపై ఈ ఇద్దరి ఫొటోలను ముద్రించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే.. జాతిపిత మహాత్మా గాంధీ ఫొటోలతో కూడా ఇప్పటిలానే కరెన్సీ చలామణి అవుతుంది. కొన్ని డినామినేషన్ నోట్లపై మాత్రమే రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలను ముద్రించనున్నారు. అయితే.. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటనే సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి ఆర్‌బీఐ చెబుతున్న సమాధానం ఏంటంటే.. కరెన్సీ నోట్లపై ప్రముఖల ఫొటోలను ముద్రించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను, అవకాశాలను అన్వేషిస్తున్నామని, ఆ అన్వేషణలో భాగంగానే ఈ యోచన చేస్తున్నట్లు తెలిపింది.



మన దేశంలో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో మాత్రమే ఉంటుంది. కానీ.. అగ్ర రాజ్యంగా పేరొందిన అమెరికాలో డాలర్లపై చాలా మంది ఆ దేశ ప్రముఖులు ముద్రించబడ్డాయి. జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫ్ఫర్‌సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్‌తో పాటు 19వ శతాబ్దంలో ఆ దేశాధినేతలుగా చేసిన కొందరి ఫొటోలతో ఆ దేశంలో కరెన్సీ చలామణీలో ఉంది. ఇదిలా ఉండగా.. రవీంద్రనాథ్ ఠాగూర్, కలాం ఫొటోలతో కొత్త నోట్ల ముద్రణ ఎంతవరకొచ్చిందనే ప్రశ్నకు కూడా ఆర్‌బీఐ సమాధానం చెప్పింది. ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉండే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SPMCIL) గాంధీ, ఠాగూర్, కలాం వాటర్‌మార్క్స్‌ను రెండు సపరేట్ సెట్స్‌గా IIT-Delhi Emeritus Professor Dilip T Shahaniకి పంపడం జరిగింది. ఆ రెండు సెట్స్‌లో ఎంపిక చేసి అంతిమ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు Dilip T Shahani చెప్పారు. ప్రొఫెసర్ సహానీ వాటర్‌మార్క్స్‌ను అధ్యయనం చేయడంలో నిపుణులు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ప్రావీణులైన ఆయనకు ఈ ఏడాది జనవరిలో కేంద్రం పద్మశ్రీని ప్రదానం చేసింది.

Updated Date - 2022-06-05T20:26:20+05:30 IST