ఫైనల్‌ విద్యార్థులు పరీక్షలు రాయాల్సిందే!

ABN , First Publish Date - 2020-07-07T09:02:32+05:30 IST

డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణపై కొద్ది వారాలుగా కొనసాగుతున్న అనుమానాలకు ..

ఫైనల్‌ విద్యార్థులు పరీక్షలు   రాయాల్సిందే!

కేంద్రం ఆదేశాలతో స్పష్టత.. సెప్టెంబర్లోగా పూర్తిచేయాలి 

విద్యార్థులకు రెండుసార్లు అవకాశమివ్వండి.. యూజీసీ కొత్త మార్గదర్శకాలు 


అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణపై కొద్ది వారాలుగా కొనసాగుతున్న అనుమానాలకు తెరపడింది. ఇక అన్ని కోర్సుల ఫైనలియర్‌, ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులు పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. పరీక్షల నిర్వహణకు  కేంద్ర హోంశాఖ సోమవారం అనుమతులు ఇచ్చింది. కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొవిడ్‌ - 19 నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అందులో సూచించింది. 


దీంతో ఇక దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో, కళాశాలల్లో చివరి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. వీటిని సెప్టెంబరు లోగా పూర్తిచేయాలని యూజీసీ సోమవారం మరోసారి మార్గదర్శకాలు  జారీచేసింది. గతంలో జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం  పరీక్షలను జూలైలోపు పూర్తిచేయాల్సి ఉండగా.. తాజాగా దీనిని సెప్టెంబరు వరకు పొడిగించింది. పరీక్షల తేదీలను మార్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ చేసిన విజ్ఞప్తి మేరకు యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది.


ఇవీ తాజా మార్గదర్శకాలు.. 

ఫైనలియర్‌/ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులందరికీ పరీక్షలు సెప్టెంబరు ఆఖరులోగా పూర్తిచేయాలి. 


బ్యాక్‌లాగ్స్‌ ఉన్న చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ విధానం ఏదైనా అందులో అర్హత సాధించడం తప్పనిసరి. 


పరీక్షలు ఆఫ్‌లైన్‌ (రాత పరీక్ష) లేదా ఆన్‌లైన్‌.. లేదా రెండూ కలగలిపి అనుకూలంగా ఉండే ఏ విధానంలోనైనా నిర్వహించుకునే 


స్వేచ్ఛ యునివర్సిటీలు, కళాశాలలకు ఉంది. 


కారణం ఏదైనా సెప్టెంబరులో హాజరుకాని విద్యార్థుల కోసం మరోసారి పరీక్ష రాసేందుకు అనుమతించే అవకాశాన్ని పరిశీలించాలి. ఈ అవకాశం కరోనా ప్రత్యేక పరిస్థితులు కాబట్టి ఈ ఒక్కసారికే వర్తిస్తుంది. 


ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించి ఏప్రిల్‌-29న విడుదలచేసిన మార్గదర్శకాలే వర్తిస్తాయి. 


ఇక ఏర్పాట్లు షురూ..:

ఫైనలియర్‌ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేకపోవడం రాష్ట్రంలో వాయిదావేస్తూ వస్తున్నారు. దీంతో గత ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన బీటెక్‌, బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈడీ, బీబీఎ, బీపీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎల్‌ఎల్‌ఎం, ఎంఈడీ.. ఇతర కోర్సులకు సంబంధించిన చివరి సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి.  కేంద్రం ఆదేశాలతో ఈ పరీక్షలు నిర్వహణకు అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఇక కసరత్తు ప్రారంభించనున్నాయి పరీక్షల తేదీలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంపై  త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

Updated Date - 2020-07-07T09:02:32+05:30 IST