కొడాలి నానిపై కేసు నమోదు చేయండి
ABN , First Publish Date - 2020-09-22T10:56:01+05:30 IST
హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్య
పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 21: హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ పోలీసులను బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డిని కలవాలని వీరు ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేరు.
అందుకని ఎస్బీ డీఎస్పీ గంగయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్రెడ్డి, సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ... హిందువుల మనోభావాలను గాయపరిచిన కొడాలిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఆంజనేయస్వామి విగ్రహానికి ఓ చేయి విరిగిపోతే దేవుడికి ఏమౌతుందని కొడాలి నాని వ్యాఖ్యానించడంతో వీరు కృష్ణాపురంఠాణా వద్దకు చేరుకున్నారు.
పంచముఖ ఆంజనేయస్వామికి పూజలుచేసి వినతిపత్రం సమర్పించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలిని పదవీభ్రష్టుడ్ని చేయాలని స్వామిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటముని, పొనగంటి భాస్కర్, వరప్రసాద్, మునిసుబ్రమణ్యం, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మదనపల్లెలో బీజేపీ నేత చల్లపల్లె నరసింహారెడ్డి తదితరులు.. పీలేరు, పుంగనూరుల్లో బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరులో బీజేపీ నేతలు వీరాంజనేయస్వామి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
హిందువుల ఆలయాలు, దేవుళ్ల గురించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి అలిపిరిలోని పాతచెక్పోస్టు వద్ద బీజేపీ, తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి (టీటీఎస్), ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలను గాయపరిచే విధానాలను సహించేది లేదని, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.